దుబాయ్లో సరికొత్త నిబంధన; మీరితే భారీ జరిమానా!
దుబాయ్ : కఠిన చట్టాలకు మారుపేరైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో సరికొత్త నిబంధన తీసుకువచ్చింది. ప్రజా రహదారుల్లో మురికిగా ఉన్న కార్లను పార్క్ చేస్తే 500 దీనార్లు(దాదాపు రూ.9000) జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు దుబాయ్ మున్సిపాలిటి నిబంధనలు జారీ చేసింది. మున్సిపల్ ఇన్స్పెక్టర్లు తరచుగా వాహనాలను చెక్ చేస్తారని, మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు అందజేస్తారని పేర్కొంది. ఒకవేళ ఇది పునరావృతమైతే కారును స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని వెల్లడించింది.
అదే విధంగా.. ‘ పర్యావరణహిత పట్టణం కోసం ఈ నిబంధనలు’ అని ట్వీట్ చేసిన దుబాయ్ మున్సిపాలిటి... పర్యాటకులు కూడా ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని కోరింది. గల్ఫ్ దేశమైన యూఏఈ ఆదాయంలో పర్యాటకానిది కూడా సింహభాగమని చెప్పవచ్చు. నిరంతరం పర్యాటకుల తాకిడితో వెలుగొందే ముఖ్య పట్టణాల్లో ఇలాంటి నిబంధనలు విధించడం ద్వారా వారికి మరింత ఆహ్లాదం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.