'మోదీ హయాంలో భారత్కు గడ్డుకాలం' | Sakshi
Sakshi News home page

'మోదీ హయాంలో భారత్కు గడ్డుకాలం'

Published Wed, Feb 25 2015 9:42 AM

'Amnesty' criticises Narendra Modi government

ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ లో జాతి వైరాలు ఎక్కువవుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా దేశంలో చాలామంది భారతీయులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారని ఆ సంస్థ పేర్కొంది.

మే 2014లో జరిగిన సాధరణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనలు పరిశీలనలోకి తీసుకున్న ఆమ్నేస్టీ.. జరిగిన ఘర్షణలన్నీ కూడా కార్పోరేట్ ప్రాజెక్టుల నేపథ్యంలో జరిగినవేనని పేర్కొంది. ఆ ప్రాజెక్టు నిర్మించే క్రమంలో అక్కడి వారిని సంప్రదించకుండా ఉండటం వల్ల వర్గాలుగా ఏర్పడి ఘర్షణలు తలెత్తుతున్నాయంది. ప్రజలకు సుస్థిరమైన, సురక్షితమైన పాలనను అందిస్తానని, మెరుగైన వసతులు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ అనంతరం ఎవ్వరినీ సంప్రదించకుండానే ప్రాజెక్టులు పూర్తి చేసేలా, కార్పొరేట్ సంస్థలకు తలొగ్గేలా పనిచేస్తున్నారని విమర్శించింది.

 

మరోపక్క ఉగ్రవాద చర్యల పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా సాధా సీదాగా వ్యవహరిస్తున్నాయని ఇది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది. ప్రపంచ దేశాలు ఆయుధాల దిగమతి నిలిపివేసి, ఉగ్రవాదాన్ని, హింసను, దాడులను నియంత్రించే చర్యలపై దృష్టి పెట్టాలని ఈ క్రమంలో ఎవరి హక్కులకు భంగం కలగరాదని పేర్కొంది. 

Advertisement
Advertisement