సృజనాత్మకతకు ఓ వేదిక! | A platform for creativity! | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతకు ఓ వేదిక!

Apr 16 2016 3:52 AM | Updated on Sep 3 2017 10:00 PM

కొన్ని సమస్యలు చిన్నగా అనిపిస్తాయి. కాని వాటి పరిష్కారాలు కనిపెట్టడమే చాలా కష్టం. ఎంతో మంది ఇలాంటి సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనిపెడుతూనే ఉంటారు.

♦ జెనీవాలో 44వ ఇన్నోవేషన్ షో ప్రారంభం
♦ ఈ నెల 17 వరకు కొనసాగనున్న ప్రదర్శన
♦ 48 దేశాల నుంచి ఔత్సాహికుల హాజరు
 
 కొన్ని సమస్యలు చిన్నగా అనిపిస్తాయి. కాని వాటి పరిష్కారాలు కనిపెట్టడమే చాలా కష్టం. ఎంతో మంది ఇలాంటి సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనిపెడుతూనే ఉంటారు. అయితే సృజనాత్మకత ఉన్న వారంతా ఒకే చోట చేరితే.. ఇలాంటి వారందరూ తమ ఆలోచనలను నలుగురితో పంచుకునేందుకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికైంది. ఏప్రిల్ 13న ప్రారంభమైన 44వ ‘ఇన్వెన్షన్ షో’ 17 వరకు కొనసాగనుంది. ఇందులో 48 దేశాలకు చెందిన 752 మంది తాము రూపొందించిన దాదాపు వెయ్యి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. అందులో మచ్చుకు కొన్ని మీకోసం..


 
 పొరపాటున తప్పిపోయిన చిన్న పిల్లలను ఈ బూట్లు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాయి. ఎలాగంటే వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మీ స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు ఫోన్‌లో కనిపిస్తాయి. ఈ బూట్లను దక్షిణ కొరియాకు చెందిన లీ యాన్ యున్ తయారు చేశారు. యున్‌ది మంచి స్మార్ట్ ఆలోచన కదా..!
 
 మొక్కజొన్న పిండిని రకరకాల వంటల్లో వాడుతుంటాం. అయితే శ్రీలంకకు చెందిన శోభనీ అనుషా విజయత మాత్రం కొంచెం వినూత్నంగా ఆలోచించింది. ఆ పిండికి మరికొన్ని పదార్థాలు కలిపి కేక్‌ల అలంకరణకు వాడే ‘ఐసింగ్’ స్థానంలో వాడే ఓ పదార్థాన్ని తయారు చేసింది. ఈ పదార్థం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని కేక్ పాడవకుండా ఉంచడమే కాకుండా షుగర్ ఫ్రీ కూడా

 
ముడిచమురును తరలించే పైపు దేశదేశాలను దాటుకుని వెళుతుంటుంది. ఈ పైపుల్లో ఎక్కడైనా చిన్న లోపమొచ్చి లీకేజీ అయినా నష్టం భారీగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఫొటోలో ఉన్న యంత్రంతో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు. రుమేనియాకు చెందిన అడ్రియన్ తొమోయిగా ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. దీని సాయంతో పెద్దపెద్ద పైపుల్లోని లోపాలను కనిపెట్టడమే కాదు మరమ్మతులు కూడా చేయొచ్చని చెబుతున్నాడు.


 
 కొన్ని రకాల పండ్లు పచ్చిగా ఉన్నా, బాగా మగ్గినా ఒకే రంగులో కనిపిస్తాయి. ఫొటోలో ఉన్న డ్యూరియన్ పండు కూడా అలాంటి కోవలోకే వస్తుంది. ఓ పండు కింద ఉన్న యంత్రాన్ని చూశారుగా! పండు ఏ స్థాయిలో మగ్గింది అనే విషయాన్ని ఇది సూక్ష్మ తరంగాల ద్వారా గుర్తించి మనకు చెబుతుంది. దీన్ని థాయ్‌లాండ్‌కు చెందిన సొరావత్ చివప్రీచ కనుగొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement