డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు | Sakshi
Sakshi News home page

డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు

Published Tue, Mar 14 2017 4:57 PM

డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు - Sakshi

ఏటీఎంలలోంచి డబ్బులు రాకపోవడంతో ప్రజల్లో అసహనం, అసంతృప్తి తీవ్రమవుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా ఎక్కడా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా అవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ తిరిగినా డబ్బు దొరక్కపోవడంతో అసహనానికి గురైన ఓ యువకుడు ఏకంగా ఏటీఎంలపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కాడు. కోఠి ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఓ యువకుడు ఆ ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో దాని అద్దాలను పగులగొట్టాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి.. ఏటీఎంను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నఅమీర్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు ప్రశ్నించినప్పుడు అమీర్ ఖాన్ చెప్పిన విషయం మరో కొత్త వివాదానికి కారణమైంది. ట్రాఫిక్ పోలీసులు వేధించడం వల్లే తాను ఏటీఎంను ధ్వంసం చేశానని అతడు చెప్పాడు. పెండింగులో ఉన్న చలాన్ మొత్తం అప్పటికప్పుడే చెల్లించాలంటూ తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారని, తన చేతిలో డబ్బులు లేకపోవడంతో పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించానన్నాడు.

 

Advertisement
Advertisement