
ఓట్ల నమోదుకు తిప్పలెన్నో..?
ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు (జనవరిలో వెలువరించనున్న ఓటర్ల జాబితా కోసం) మంగళవారం వరకే గడువు ఉండటంతో...
=ఆన్లైన్తో అవస్థలు
=పనిచేయని సర్వర్
=నిట్టూర్చిన ఓటర్లు
=ఓటర్ల జాబితా పునస్సమీక్షకు 23 వరకు గడువు పొడిగింపు
సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు (జనవరిలో వెలువరించనున్న ఓటర్ల జాబితా కోసం) మంగళవారం వరకే గడువు ఉండటంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించి.. విఫలమైన వారు వేలల్లో ఉన్నారు. ఓటుహక్కుపై అటు అధికారులతోపాటు ఇటు ఆయా రాజకీయపార్టీలు, వివిధ సంస్థలు విస్తృత ప్రచారం చేయడంతో చాలామంది తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు ఓటర్ల జాబితాలో తమ పేర్లు గల్లంతైనట్లు గ్రహించిన వారు సైతం కొత్తగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా ప్రయత్నించారు. సోమవారం నుంచే సంబంధిత వెబ్సైట్ మొరాయించినట్లు పలువురు ‘సాక్షి’ కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. వివరాలు భర్తీ చేస్తుండగానే మధ్యలో ఆగిపోయినట్లు ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లినవారికి యూఆర్ఎల్ అందుబాటులో లేకపోవడంతో ఉస్సూరంటూ నిట్టూర్చారు. ఇదే అంశాన్ని సంబంధిత అధికారుల వద్ద ప్రస్తావించగా.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఒకేసారి ప్రయత్నించినందున సమస్యలు తలెత్తి ఉండవచ్చునన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఇదే చివరి తేదీ కాదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. కాగా, ఓటర్ల జాబితా పునస్సమీక్షకు ఈ నెల 17 వరకు ఉన్న గడువును ఈ నెల 23 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది.