
నేడే ఎంసెట్-3
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఎంసెట్-3’ ప్రవేశపరీక్ష జరగనుంది.
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష
- గంట ముందే పరీక్షా హాల్లోకి అనుమతి
- నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ఎంసెట్ కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఎంసెట్-3’ ప్రవేశపరీక్ష జరగనుంది. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసే సమయానికి 40,168 మంది మాత్రమే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు. పాత హాల్టికెట్లతో వచ్చే వారిని అనుమతించరు. అభ్యర్థులను గంట ముందే అంటే ఉదయం 9 గంటల నుంచే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఇవి గుర్తుంచుకోండి
► అభ్యర్థులు పూర్తిచేసిన ఆన్లైన్ దరఖాస్తును పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్లకు అందజేయాలి. దానిపై కలర్ పాస్పోర్టు సైజు ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారి లేదా కళాశాల ప్రిన్సిపాల్తో ధ్రువీకరణ చేయించి ఉండాలి.
► పరీక్షా కేంద్రంలోకి బ్లాక్/బ్లూ బాల్పాయింట్ పెన్, ఆన్లైన్ దరఖాస్తు, హాల్ టికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే తీసుకురావడానికి అనుమతిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎంసెట్-2 దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణపత్రం సమర్పించని పక్షంలో ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి.
► పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్లు, మేథమెటికల్/లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలనైనా తీసుకురావడం నిషేధం.
► హాజరు కోసం అభ్యర్థులు బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్) సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. లేకుంటే పరీక్ష రాయనివ్వరు.
► పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులను పరీక్షా హాల్ నుంచి బయటకు పంపరు.