
ఐఫోన్ షాప్కు పరదాలు కట్టి..!
దొంగలు కూడా తెలివిమీరిపోయారు. హైదరాబాద్ నగరంలో వినూత్నరీతిలో ఓ ఐఫోన్ షాప్కు కన్నం వేశారు.
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): దొంగలు కూడా తెలివిమీరిపోయారు. హైదరాబాద్ నగరంలో వినూత్నరీతిలో ఓ ఐఫోన్ షాప్కు కన్నం వేశారు. ఏకంగా రూ. 25 లక్షలు విలువచేసే ఐఫోన్లను చోరీచేసి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. ఈ ఘటన ఈ ఘటన మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. సికింద్రాబాద్ ఎస్డీరోడ్లోని మినర్వా కాంప్లెక్స్ ప్రాంతంలో అపెక్స్ ఆపిల్ మొబైల్ ఔట్లెట్ ఉంది. ఇందులో ఆపిల్ ఫోన్లు విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం షోరూమ్లో పనిచేసే సిబ్బంది వచ్చి చూసేసరికి షట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దుకాణం తెరిచి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు తాళాలు పగులగొట్టి రూ.24.85లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లు, రూ.51వేల నగదును దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. మహంకాళి ఏసీపీ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. తెల్లవారుజామున 4 నుంచి 7గంటల మధ్య చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పరదాను అడ్డుపెట్టి..
చోరీ చేస్తున్న విషయం ఎవరు పసిగట్టకుండా దొంగలు తెలివిగా జాగ్రత్తలు తీసుకున్నారు. షట్టర్ ముందు పరదాను అడ్డుపెట్టి తమ పనికానిచ్చేశారు. దొంగతనం మొత్తం కొద్ది నిమిషాల్లోనే పూర్తిచేసి వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.