దుబాయ్‌కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’ | Telangana brand 'Mango' to Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’

Apr 11 2016 3:42 AM | Updated on Oct 9 2018 4:55 PM

దుబాయ్‌కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’ - Sakshi

దుబాయ్‌కు తెలంగాణ బ్రాండ్ ‘మామిడి’

పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడితో రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

♦ ఎగుమతులు చేయాలని ఉద్యాన శాఖ యోచన
♦ వ్యాపారులతో చర్చిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు
♦ రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టడంపై కసరత్తు
♦ విదేశాల్లో కిలో రూ. 300 వరకు పలుకుతున్న నాణ్యమైన పండ్లు
 
 సాక్షి, హైదరాబాద్: పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడితో రైతులకు అధిక ఆదాయం సమకూర్చిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దుబాయ్‌కు ‘తెలంగాణ బ్రాండ్’తో మామిడి పండ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. నాణ్యమైన పండ్లను గుర్తించి వాటిని దుబాయ్‌కు పం పేందుకు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే  మామిడి పండ్ల వ్యాపారులు, రైతులతో చర్చించారు. అన్నీ కుదిరితే వచ్చే నెలలో దుబాయ్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉంది.

 రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి..
 రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో ఏటా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కాస్తాయి. అందులో దాదాపు 6 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్తర భారతదేశానికి వెళ్తుంటాయి. విదేశాలకు మాత్రం 5-6 వేల మెట్రిక్ టన్నులకు మించి మామిడి పండ్ల ఎగుమతులు కావడంలేదు. చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాలకు మన దేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచే మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ బ్రాండ్‌తో నాణ్యమైన మామిడి రకం అంటూ ఒకటి ప్రజాదరణ పొందలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో సరైన మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులకు కిలో రూ. 25-50 మించి దక్కడంలేదు.

స్థానికంగా ఇంత తక్కువ ధర పలుకుతున్న మామిడి పండ్లు... విదేశాలకు ఎగుమతి చేస్తే వాటి ధర కిలో రూ. 300 వరకు ఉంటోంది. కాబట్టి సేంద్రీయ, సహజ మామిడి పండ్లపై దృష్టి సారించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాండ్‌తో విక్రయించేలా నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పండుతోన్న నాణ్యమైన మామిడి పండ్లను గుర్తించి వాటిని తెలంగాణ బ్రాండ్‌తో విక్రయించాలని భావి స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 సేంద్రీయ పండ్లపైనే దృష్టి..
 తెలంగాణ బ్రాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కల్తీలేని సేంద్రీయ పండ్లు, కూరగాయలు, అల్లం, కారం, పసుపు తదితర పదార్థాలను ప్రజలకు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ)ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులు పండించిన సేంద్రీయ పండ్లను కార్పొరేషన్ సేకరిస్తుంది.  మామిడి పండ్లను సహజంగా మాగబెట్టి నాణ్యమైన వాటిని ఎగుమతి చేస్తారు. భారీ చెట్లు పెరగకుండా తక్కువ ఎత్తులోనే మామిడి కోసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల ఒక ఎకరంలోనే దాదాపు 675 మొక్కలను వేసే అవకాశం ఉంటుంది.

 ఎగుమతి చేసే ఆలోచన ఉంది
 దుబాయ్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేయాలని యోచిస్తున్నాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రైతులకు అధికలాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం.    
- వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement