
బీజేపీని నడిపించే వారెవరు...?
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం లేదు.
కొత్త నాయకుడి వేటలో రూరల్ అర్బన్ లొల్లి
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి జరుగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాష్ట్రంలో విస్తరణకు, బలోపేతానికి మంచి అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తోంది.
పార్టీ సంస్థాగత సంవత్సరంగా భావిస్తున్న ఈ తరుణంలో వీలైనంత త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గానికి ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో నాయకత్వం ఉంది. పార్టీలోని సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, పార్టీ శాసనసభాపక్షం మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ, పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనా రెడ్డి ఇప్పటిదాకా పోటీలో ఉన్నారు.
జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్లు కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పార్టీకి ఇప్పటిదాకా హైదరాబాద్కు చెందిన నాయకులే ఎక్కువగా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారని, దీనితో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కావడం లేదని గ్రామీణ ప్రాంతాల నేతల వాదన. పార్టీకి ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్లో పార్టీ బలంగా ఉందని, కొత్తగా జిల్లాల్లోనే పార్టీ విస్తరణకు కృషి చేయాల్సి ఉందని వారి అభిప్రాయం. గామీణ ప్రాంతాల్లోని అంశాలు, సమస్యలు, గ్రామాలపై ప్రభావం చూపించే విధానాలపై విసతృత పోరాటాలు చేస్తే తప్ప బీజేపీకి మనుగడ లేదన్నది మరో వర్గం వాదిస్తోంది.
ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవిని జిల్లాల్లో పనిచేయగలిగే నేతలకే ఇవ్వాలని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నేతలు కొందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్లు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తూనే, హైదరాబాద్లో స్థిరపడిన నేతలు కూడా జిల్లాల వారే కదా అంటూ మరో వాదన లేవనెత్తారు. ఒకరు, ఇద్దరు నేతలు మినహా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసినవారంతా హైదరాబాద్కు మాత్రమే చెందినవారు కాదని వారంటున్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై, ప్రభావం చూపించే విధానాలపై సమగ్రమైన అవగాహనతో, పార్టీ నేతలను, శ్రేణులను సమన్వయం చేసుకుని నడిపించే నాయకుడు అయితే చాలునని వారు అభిప్రాయపడుతున్నారు.