ఆటో ప్రయాణికులే ఆరుగురి టార్గెట్! | Six youth caught by police over stealing cellphones | Sakshi
Sakshi News home page

ఆటో ప్రయాణికులే ఆరుగురి టార్గెట్!

Jun 14 2016 6:55 PM | Updated on Sep 4 2017 2:28 AM

ఆటో ప్రయాణికులే ఆరుగురి దొంగల టార్గెట్. పథకం ప్రకారం ప్రయాణికులకు ఆటోలో ఎక్కించుకోవడం.. ప్రయాణికుల సెల్‌ఫోన్‌లు, పర్సులు కొట్టేయడంలో వీరు ఘనాపాఠీలు.

అడ్డగుట్ట: ఆటో ప్రయాణికులే ఆరుగురి దొంగల టార్గెట్. పథకం ప్రకారం ప్రయాణికులకు ఆటోలో ఎక్కించుకోవడం.. ప్రయాణికుల సెల్‌ఫోన్‌లు, పర్సులు కొట్టేయడంలో వీరు ఘనాపాఠీలు. వారాసిగూడ, పాతబస్తీలకు చెందిన ఈ ఆరుగురు యువకులు చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వారాసిగూడకు చెందిన ఖాజా పాషా(23) అనే ఆటో డ్రైవర్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్(24), ఫర్వేజ్(22), మహ్మద్ ఖాధీర్(21), మహ్మద్ శవాజ్ (22)లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు.

ఖాజా పాషా ఆటోలో వీరు ప్రయాణిస్తూ ఆటోలో ఎక్కిన ప్రయాణికుల సెల్‌ఫోన్లను మాయం చేస్తుంటారు. దొంగిలించిన సెల్‌ఫోన్లను జగదీశ్ మార్కెట్‌లోని మరో స్నేహితుడు ఫయాజ్(23)కు అమ్ముతుంటారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని సంతోష్ సొసైటీ వద్ద డబ్బులు పంచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తుకారాంగేట్ పోలీసులు ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహ్మద్ ఫర్వేజ్ పై హత్య కేస్, రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందని, మిగిలిన వారు అంతా చిన్న దొంగలు. వారి వద్ద నుంచి 53 సెల్‌ఫోన్లు, 4 తల్వార్లు, రూ.15వేలు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement