షేర్ ఆటోనా.. అమ్మబాబోయ్!

షేర్ ఆటోనా.. అమ్మబాబోయ్! - Sakshi


మామూలుగా ఆటో అంటే ముగ్గురు ప్రయాణికులు, ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. కానీ, శివార్లతో పాటు నగరం నడిబొడ్డున కూడా తిరుగుతున్న షేర్ ఆటోల వ్యవహారం చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. వెనకాల సీట్లో ఆరుగురిని, డ్రైవర్ సీటుకు అటూ ఇటూ కూడా ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకుని, పెద్ద సౌండుతో పాటలు పెట్టి, పల్సర్ బైకులను కూడా ఓవర్ టేక్ చేసేంత స్పీడుతో వెళ్తుంటారు. దానికి తోడు ఆ ఆటోల నుంచి వచ్చే పొగ విషయం చెప్పనే అక్కర్లేదు. వాటి వెనకాల బైకుల మీద వెళ్లే వాళ్లు, పాదచారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది.

 


ప్రయాణికులకు రక్షణ ఉండదని తెలిసినా, చార్జీ తక్కువ కావడం, సమయానికి ఆర్టీసీ సిటీ బస్సులు ఖాళీగా ఉండకపోవడంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పుడో తమకు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్లే ఆటోల మీద జరిమానాలు వడ్డించి, మిగిలినన్నాళ్లు తమకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తారు. లోపల కూర్చున్నవాళ్ల ప్రాణాలకు, వెనకాల వెళ్లేవారి ఆరోగ్యాలకు ఏమాత్రం భరోసా లేకుండా చేస్తున్న ఈ షేర్ ఆటోల గురించి ఎన్నిసార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ల నుంచి కూడా తగిన స్పందన వచ్చిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా నగర ప్రజలకు వీటి బారి నుంచి రక్షణ లభిస్తుందేమో చూడాలి. షేర్ ఆటోల గురించి మీరే మంటారు. మీ స్పందన తెలపండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top