కారులో నుంచి అరుపులు వినిపించాయి | Screams could be heard from the car | Sakshi
Sakshi News home page

కారులో నుంచి అరుపులు వినిపించాయి

May 4 2016 3:32 AM | Updated on Aug 30 2018 4:07 PM

కారులో నుంచి అరుపులు వినిపించాయి - Sakshi

కారులో నుంచి అరుపులు వినిపించాయి

ఈ నెల 1న జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ బిల్డర్ కట్కూరి నిరంజన్‌రెడ్డి కుమార్తె కట్కూరి దేవి(21) మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

♦ జూబ్లీహిల్స్ ప్రమాదంలో దేవి మరణంపై ప్రత్యక్ష సాక్షి
♦ ఓ యువకుడు ఆమెను వెంబడించి..కారులోకి తోసేశాడని వెల్లడి
♦ ప్రమాదంపై అనుమానాలున్నాయి.. న్యాయం చేయండి: దేవి బంధువులు
 
 హైదరాబాద్: ఈ నెల 1న జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ బిల్డర్ కట్కూరి నిరంజన్‌రెడ్డి కుమార్తె కట్కూరి దేవి(21) మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జర్నలిస్టు కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతురాలి పెదనాన్న నరేందర్‌రెడ్డితో కలసి ప్రత్యక్ష సాక్షి రాము వివరాలు వెల్లడించారు.

 ‘ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి కార్లు కడగడానికి బయటకు వచ్చా. అప్పటికే రోడ్డు చివరలో ఓ కారు ఆగి ఉంది. అందులోంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. చీకటిగా ఉండటంతో భయపడి అక్కడికి వెళ్లలేదు. అయితే కారులో నుంచి ఓ యువతి దిగి అరుస్తూ పరిగెత్తే ప్రయత్నం చేయగా, ఆమెను ఓ యువకుడు వెంబడించి పట్టుకున్నాడు. బలవంతంగా కారులోకి తోసేశాడు. అరగంటపాటు వారిద్దరూ కారులోనే ఉన్నారు. కారు తలుపులు కొడుతూ ‘హెల్ప్.. హెల్ప్’ అన్న అమ్మాయి అరుపులు వినిపించాయి. ఈ విషయం చెప్పేందుకు పక్కనే ఉన్న ఇంటకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టా. అది పనిచేయకపోవడంతో వెనుదిరిగా. కారులో మరొకరు ఉండవచ్చు. తెల్లవారుజాము 4.30 గంటల ప్రాంతంలో కారు వేగంగా దూసుకుపోయింది. పావుగంట తర్వాత పాలు సరఫరా చేసే వ్యక్తి వచ్చి కొద్ది దూరంలో కారు చెట్టుకు ఢీకొన్న విషయాన్ని నాకు చెప్పాడు. వెళ్లి చూడగా ప్రమాదానికి గురైంది అదే కారు (నంబర్ 1116)’ అని రాము తెలిపారు.

 అది హత్యే: పెదనాన్న నరేందర్ రెడ్డి
 దేవి పెదనాన్న నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... తన తమ్ముడు నిరంజన్‌రెడ్డి ఉదయం 5.15 గంటలకు ఫోన్ చేశాడన్నారు. తాను ఘటనా స్థలానికి చేరేసరికే ప్రమాదానికి కారణమైన దేవి స్నేహితుడు సామ భరతసింహారెడ్డి తల్లిదండ్రులు వచ్చి ఉన్నారని... పోలీసులు, వైద్యులను వారు అప్పటికే మేనేజ్ చేశారని ఆరోపించారు. సన్నగా ఉన్న చెట్టుకు కారు ఢీకొంటే అదెందుకు విరగలేదని ప్రశ్నించారు.  మద్యం మత్తులో జరిగిందని డీసీపీ వెంకటేశ్వరరావు చెబుతున్నారని, జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం బ్రీత్ ఎనలైజర్ జీరో చూపిందని తెలిపారన్నారు. దేవిది కచ్చితంగా హత్యేనని, వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేసేవరకూ పోరాడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement