కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో.. | revanth reddy slams kcr | Sakshi
Sakshi News home page

కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో..

May 24 2016 8:32 PM | Updated on Aug 15 2018 9:30 PM

కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో.. - Sakshi

కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు.

- కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ సెటైర్
- టిక్కెట్లిస్తాం.. టీడీపీలోకి రండి


హైదరాబాద్: కంటి ముందు అభివృద్ధి.. ఇంటిముందు అభ్యర్థి అని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను నమ్మించి బల్దియా ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్ నాయకులు ఆపత్కాలంలో ప్రజలను విస్మరించారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో జరిగిన మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఇటీవలి గాలివానలకు భారీ హోర్డింగుల కూలినా, రోడ్లు దెబ్బతిన్నా,నాలుగు రోజులైనా కరెంటు రాకున్నా, ప్రజా జీవనం అస్తవ్యస్తమైనప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా ప్రజల వద్దకు రాలేదని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు. యాపిల్ సంస్థ సీఈవో నగరానికి వచ్చిన సందర్భంగా కొడుకు సెల్ఫీలతో, తండ్రి సెల్ఫ్ డబ్బాతో డంబాలు పలికినా పెద్ద ప్రాజెక్టు మాత్రం బెంగళూరుకు వెళ్లిందన్నారు. నగరంలో 300 అడుగుల భారీ జాతీయ పతాకంతో సహ అమలు కాని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.


టిక్కెట్లిస్తాం.. టీడీపీలోకి రండి..
రాబోయే రోజుల్లో తెలంగాణ పార్లమెంటు స్థానాలు 40 కి పెరుగుతాయని, సీనియర్లు పెద్దగా లేరని, టీడీపీలోకి వచ్చే యువకులకు మంచి అవకాశం ఉంటుందన్నారు. మాపార్టీలోకి రండి దాదాపు 30 మంది యువతకు సీట్లిచ్చి గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.కృష్ణయాదవ్ వంటివారు సైతం టీడీపీ నుంచి ఎదిగిన వారే తప్ప వారేం పెద్ద మొనగాళ్లు కాదన్నారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి నగరంలో బల్దియా ఎన్నికల్లో కొందరు మోసం చేసి పోయారని, రాబోయే రోజుల్లో పేద, దళిత, బడుగు, బలహీనవర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

కేసీఆర్‌పై పోరాటాం
సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు తప్పయిందని ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను మరిచిపోయి పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. 2019 కోసం పోరాటం చేయాలన్నారు. గతంలో నిజాం పాలనపై పోరాటం చేసిన ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ పాలనపై పోరాటాం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన దొరల పాలన. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, గత సీఎంలు నెలలో కనీసం 15 సార్లు సచివాలయానికి వచ్చేవారని, కేసీఆర్‌ మాత్రం ఆర్నెళ్లకు ఆరుసార్లు మాత్రమే వచ్చారన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement