మరుగుజ్జు ఎద్దు..దులియా జాతి గేదెలు! | Pashu sankrathi as a fest and celebrating | Sakshi
Sakshi News home page

మరుగుజ్జు ఎద్దు..దులియా జాతి గేదెలు!

Jan 27 2018 4:04 AM | Updated on Jan 27 2018 4:04 AM

Pashu sankrathi as a fest and celebrating - Sakshi

అమ్మకానికి వచ్చిన వివిధ జాతుల గేదెలు, కొంగనూరు మరుగుజ్జు ఎద్దు

హైదరాబాద్‌: పశుసంక్రాంతితో హైదరాబాద్‌ నగరశివారు గండిపేట మండలం నార్సింగి గ్రామం సందడిగా మారింది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే రెండవ శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి గేదెలను తెచ్చి వ్యాపారులు ఇక్కడ అమ్ముతారు. గుజరాత్, హరియాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి ముర్రా, దులియా, ఆంధ్రా గుజ్జారీ లతో పాటు దేశీ ఆవులు అమ్మకానికి తరలి వచ్చాయి. ఇందులో మూడు అడుగుల లోపు ఎత్తున్న కొంగనూరు మరుగుజ్జు ఎద్దు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ఇక్కడ పొట్టేళ్ల జాడే కనిపించలేదు.  

రికార్డు ధర
దులియా జాతి గేదె రూ.2.10 లక్షలు పలకగా ముర్రాజాతి గేదె రూ.2లక్షలు పలికింది. నార్సింగి సమీపంలో పాల వ్యాపారి బి.భరత్‌ వాటిని దక్కించుకున్నారు. పూటకు 20లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. వీటితో ఓ దున్నపోతు సైతం రూ.2లక్షల ధర పలికింది.

దేశవ్యాప్త గుర్తింపు : ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌
నార్సింగిలో జరిగే పశుసంక్రాంతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడేకంటే స్థానికంగా కొనుగోలు చేస్తేనే నయమనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ తలారి మల్లేశ్, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు పత్తి ప్రవీణ్‌కుమార్, మంచర్ల మమత శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement