టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఆయనకు స్వల్పస్థాయిలో ఛాతీలో నొప్పి వచ్చింది.
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఆయనకు స్వల్పస్థాయిలో ఛాతీలో నొప్పి వచ్చింది. నిద్రలో ఒక్కసారిగా నొప్పి రావడంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే కుటుంబసభ్యులతో కలసి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణమోహన్లతో కూడిన వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇది గుండెకు సంబంధించిన నొప్పికాదని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చిన నొప్పి అని వైద్యులు నిర్ధారించారు.
ఈ సందర్భంగా పదిమంది వైద్యులతో కూడిన బృందం దాదాపు ఏడుగంటలపాటు ఆయన్ను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించింది. అంతా సర్దుకోవడంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ సమయంలో కేటీఆర్ తండ్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.