300 ఎంబీబీఎస్ సీట్లకు కోత! | Indian Medical Council not given permission to 300 mbbs seats | Sakshi
Sakshi News home page

300 ఎంబీబీఎస్ సీట్లకు కోత!

May 16 2014 2:20 AM | Updated on Sep 2 2017 7:23 AM

రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) షాక్ ఇచ్చింది. గతేడాది ఈ కాలేజీలకు అదనంగా కేటాయించిన సీట్ల కొనసాగింపునకు తిరస్కరించింది.

 నాలుగు వైద్య కాలేజీల్లో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ నో
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) షాక్ ఇచ్చింది. గతేడాది ఈ కాలేజీలకు అదనంగా కేటాయించిన సీట్ల కొనసాగింపునకు తిరస్కరించింది. దీంతో 300 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. గత ఏడాది కొత్తగా ఏర్పాటైన నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలకు 100 సీట్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఈ సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ తిరస్కరించింది. అలాగే ఒంగోలులోని రిమ్స్ కాలేజీలో కొన్నేళ్లుగా 100 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతుండగా, ఈ ఏడాది ఆ సీట్ల రెన్యువల్‌కు అనుమతినివ్వలేదు. దీంతో నిజామాబాద్, ఒంగోలు రిమ్స్‌లలో ఈ ఏడాది అడ్మిషన్లు ఉండవు. సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లుండగా, గతేడాది అదనంగా 50 సీట్లు ఇచ్చారు.

ఇప్పుడు ఆ 50 సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ అనుమతించలేదు. తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య కళాశాల పరిస్థితీ అంతే. గత ఏడాది ఇచ్చిన 50 సీట్లకు ఈసారి అనుమతినివ్వలేదు. వైద్య విద్యకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, అధ్యాపకుల కొరత ఉందన్న కారణంగానే సీట్లను తొలగించినట్లు ఎంసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,300 సీట్లుండగా, ఆ సంఖ్య ఈ ఏడాది 2 వేలకు పడిపోయింది. మరికొద్ది రోజుల్లో ఎంసెట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో సీట్లలో కోత విధించడంతో ఎంబీబీఎస్‌లో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement