ఎస్‌ఎంఎస్ చేస్తే కేసు వివరాలు | If the SMS case details | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంఎస్ చేస్తే కేసు వివరాలు

Sep 30 2015 2:12 AM | Updated on Aug 21 2018 5:52 PM

ఎస్‌ఎంఎస్ చేస్తే కేసు వివరాలు - Sakshi

ఎస్‌ఎంఎస్ చేస్తే కేసు వివరాలు

మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా...? కేసు స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా..?

సాక్షి, సిటీబ్యూరో : మీరు ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా...? కేసు  స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారా..? కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు తిప్పించుకుంటున్నారా...? ఇక నుంచి ఫిర్యాదుదారులకు ఇలాంటి తిప్పలు లేకుండా సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఫిర్యాదుదారుడు తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి CYBPOL <space> CS <space> Police Station/Crime No/Year అని టైప్ చేసి  9731979899 నంబర్‌కు సందేశం పంపిస్తే కేసు పురోగతి గురించి సమాచారం వెంటనే వచ్చేస్తుంది. సైబరాబాద్ పోలీసులు ఇటీవల ప్రారంభించిన ఎస్‌ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌కు మంచి స్పందన వస్తోంది.

 వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నా ఎస్‌ఎంఎస్‌లు
 ‘ఎస్‌ఎంఎస్ ద్వారా కేసు వివరాలను తెలుసుకునేందుకు తొలుత కమిషనరేట్ వెబ్‌సైట్‌కి వెళ్లి నో యువర్ కేస్ స్టేటస్‌కి వెళ్లాలి. కేసు స్టేటస్ త్రూ ఎస్‌ఎంఎస్‌ని క్లిక్ చేయాలి. ఫిర్యాదుచేసిన పోలీసు స్టేషన్ పేరు, క్రైం నంబర్, పేరు, మొబైల్ నంబర్‌లను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎస్‌ఎంఎస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే కేసు స్థితిగతుల వివరాలు మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. కేసుకు సంబంధించి ఎప్పుడూ పురోగతి లభించినా వెంటనే సదరు సమాచారం ఫిర్యాదుదారుడి సెల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.

‘సైబరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన ఈ ఎస్‌ఎంఎస్ విధానం ద్వారా ఠాణాలు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి తప్పింది. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు వ్యక్తిగత పనులకు ఎటువంటి అంతరాయం కలగడం లేదు. ఫోన్ పట్టుకొని నంబర్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేసు పురోగతి వివరాలు వచ్చేస్తున్నాయ’ని గచ్చిబౌలికి చెందిన అరుణ్ తెలిపాడు.   క్రైమ్ నంబర్, ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీ, పేరుతో పాటు కేసు విచారణ దశలో ఉందా, ఉంటే అందుకు కారణాలు ఏంటనే వివరాలు వచ్చేస్తున్నాయని తెలిపాడు. 

కాగా, ఈ  ఎస్‌ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్ పద్ధతి వల్ల తమకు కూడా చాలా పనిభారం తప్పినట్టైందని, ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలను ఫిర్యాదుదారుడికి ఎస్‌ఎంఎస్ రూపంలో చెరవేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఠాణాకు ప్రతిసారి కేసు వివరాలు తెలుసుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని, దీంతో వాళ్లకు సర్దిచెప్పడం లాంటి సంఘటనలు కూడా తగ్గాయని అంటున్నారు. అలాగే కమిషనర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వివరాలు నమోదుచేసినా కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చు.
 
 దేశంలోనే తొలిసారి...

 గతంలో చాలా మంది ఫిర్యాదుదారులు కేసు పురోగతి వివరాలు తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. తిరిగే సమయం లేక కొందరు, ఒకవెళ్లినా ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక మరికొందరు...ఇలా సరైన సమాచారం లేకుండానే వెనుదిరిగిన సందర్భాలు అనేకం. ఇలాంటి ఫిర్యాదులు చాలా మా కమిషనరేట్‌కు వచ్చాయి. అందుకే  ఎస్‌ఎంఎస్ గేట్ వే ఫర్ సిటిజన్స్‌ను ప్రారంభించాం. దేశంలోనే తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఫిర్యాదుదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
      - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement