గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేందుకు చోరీలు | Girl friends to rotate the thefts | Sakshi
Sakshi News home page

గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేందుకు చోరీలు

Sep 7 2013 2:48 AM | Updated on Sep 1 2017 10:30 PM

విలాసాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ పాల్పడుతున్న ముగ్గురు యువకులు ముషీరాబాద్ పోలీసులకు పట్టుపడ్డారు.

ముషీరాబాద్ న్యూస్‌లైన్: విలాసాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ పాల్పడుతున్న ముగ్గురు యువకులు ముషీరాబాద్ పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు వీరి నుంచి 22 తులాల బంగారు నగలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, డీఐ హసీబుల్హా నిందితుల వివరాలు వెల్లడించారు...

పాతబస్తీలోని సత్తార్‌బాగ్ కు చెందిన షంషుద్దీన్ అలియాస్ టిప్పూ, మహ్మద్ ఇలియాస్, జహనుమాలోని చార్‌చమన్‌కు చెందిన మహ్మద్ షోయబ్, ఒట్టేపల్లికి చెందిన మీర్జా హయత్‌బేగ్ స్నేహితులు. వీరంతా ఇంటర్ ఫెయిల్ అయ్యారు. అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో జల్సాగా తిరిగేందుకు అవసరమైన డబ్బుల కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు.

పని ఉందంటూ టిప్పూ తన మామకు చెందిన పల్సర్ బైక్‌ను తీసుకెళ్తున్నాడు. స్నేహితులతో కలిసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ బైక్‌ను తెచ్చి మామకు అప్పగిస్తున్నాడు.  ఈ విధంగా మొత్తం 11 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అలాగే మరో బైక్‌ను దొంగిలించి దానిపై తిరుగుతూ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఇలా ఐదు ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేసి 22 తులాల బంగారాన్ని అపహరించారు. గాంధీనగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు.
 
ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లని బైక్‌పై వెళ్తున్న టిప్పూ, షోయబ్, హయత్‌బేగ్‌లను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు స్నాచింగ్స్ పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు.  మరో నిందితుడు మహ్మద్ ఇలియాస్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement