
గ్రేటర్ ఆస్తలపై ప్రైవేట్ పంజా!
‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది జీహెచ్ఎంసీ పరిస్థితి. వందల కోట్ల రూపాయల ఆస్తులుండి..నెలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నా...
పైవేటు గుప్పిట్లో జీహెచ్ఎంసీ మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులు
నామమాత్రపు అద్దెలు చెల్లిస్తూ ఆదాయానికి గండి
యథేచ్ఛగా ‘మాఫియా’ తరహా దందా
కళ్ల ముందరి ఆస్తుల్ని పట్టించుకోని
జీహెచ్ఎంసీ నిధుల కోసం దిక్కులు చూస్తున్న వైనం..
‘అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది జీహెచ్ఎంసీ పరిస్థితి. వందల కోట్ల రూపాయల ఆస్తులుండి..నెలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నా...నిధుల కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. కొన్ని ఏళ్లుగా ‘గ్రేటర్’ ఆస్తులు ప్రైవేట్ గుప్పిట్లో మగ్గుతుండడంతో అద్దెల రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. నగరవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సులు, మార్కెట్లు ఇప్పుడు ‘ప్రైవేట్ శక్తుల’ చేతుల్లో నలిగిపోతున్నాయి. దశాబ్దాల కింద నామమాత్రపు ధరలతో లీజు పొందినవారు...వాటిని ఇతరులకు అధిక అద్దెలకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అద్దెల ఆదాయం కోల్పోవడమే కాకుండా ఇప్పుడు వాటిపై జీహెచ్ఎంసీ పట్టు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. సొంత ఆస్తుల సక్రమ వినియోగంపై దృష్టి సారించకుండా గ్రేటర్ అధికారులు నిధుల కోసం అర్రులు చాచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో ఆదాయం కోసం పలు మార్గాలు అన్వేషిస్తోన్న జీహెచ్ఎంసీ సొంత ఆస్తుల సక్రమ వినియోగంపై దృష్టి సారించడం లేదు. దాంతో ఓవైపు రావాల్సిన ఆదాయం రాకపోవడమే కాక.. ఉన్న ఆస్తులపై పట్టు లేకుండా పోతోంది. జీహెచ్ఎంసీకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో 19 షాపింగ్ కాంప్లెక్సులు, వాటిల్లో 985 షాపులు/కార్యాలయాలు ఉన్నాయి. 25 మునిసిపల్ మార్కెట్లలో 2310 దుకాణాలున్నాయి. ఏళ్ల క్రితం తక్కువ దరలతో అద్దెకు ఇచ్చిన వీటిల్లో ఎవరుంటున్నారో తెలియదు. ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో పట్టించుకోవడం లేదు. నామమామాత్రపు ధరలతో లీజు పొందినవారు థర్డ్పార్టీలకు అధిక ధరలకు అద్దెలకిచ్చుకున్నా తెలియడం లేదు. నెలనెలా రావాల్సిన కనీస అద్దె సైతం రాకున్నా శ్రద్ధలేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ కాంప్లెక్సుల్లోని షాపుల అద్దెలు బహిరంగ మార్కెట్తోపోలిస్తే బహు తక్కువ. ఈ వ్యత్యాసం ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ను బట్టి మూడు రెట్ల నుంచి ఐదు రెట్ల వరకు ఉంది. అయినప్పటికీ లబ్దిదారుల నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన అద్దెను వసూలు చేయడం లేదు. మార్కెట్ ధరలను పోలుస్తూ నిర్ణీత వ్యవధుల్లో ధరలను సవరించాల్సి ఉన్నా...గత ఆరేడేళ్లుగా ఆపని చేయలేదు. దాంతో ఎంతో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా జీహెచ్ఎంసీకి ఆదాయం రాకుండా పోతోంది. అంతేకాదు. వాటినసలు పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో ఆయా కాంప్లెక్సుల్లో ఉంటున్నవారికి అవి సొంత ఆస్తుల్లా మారిపోయాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకరి పేరు మీద లీజు ఉండి మరొకరికి అద్దెకిచ్చుకున్న వారు వివిధ కాంప్లెక్సుల్లో చాలామంది ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలా థర్డ్పార్టీలకు అద్దెలకిచ్చి ఎన్నో రెట్ల ఆదాయం పొందుతున్న వారు...జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన కనీస అద్దెలు సైతం చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.
రూ.13 కోట్లకు పైగా బకాయిలు
షాపింగ్ కాంప్లెక్సుల నుంచి జీహెచ్ఎంసీకి మొత్తం రూ. 10 కోట్ల 63 లక్షల 50 వేల 308 రావాల్సి ఉండగా, రూ. 2 కోట్ల 19 లక్షల 41 వేల 323 మాత్రమే వసూలయ్యాయి. 8 కోట్ల 44 లక్షల రూపాయల బకాయిలను పట్టించుకోలేదు. వీటిల్లో సరాయి కాంప్లెక్స్ను హైదరాబాద్ మెట్రో రైలుకు అప్పగించారు. ఇక ఆ అద్దెలు రావడం భ్రమే.
మునిసిపల్ మార్కెట్ల నుంచి రూ. 5 కోట్ల 56 లక్షల 88 వేల 125 రావాల్సి ఉండగా, రూ. 60 లక్షల 18 వేల 782 మాత్రం వసూలయ్యాయి. ఇంకా రూ. 4 కోట్ల 96 లక్షల 69 వేలు రావాల్సి ఉంది. ఇలా మార్కెట్లు, షాపింగ్కాంప్లెక్సులనుంచి రూ. 13 కోట్లకు పైగా రావాల్సి ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చేష్టలుడిగి చూస్తోంది.
ఏళ్లతరబడి తిష్ట
కాంప్లెక్సులు, మార్కెట్లలోని చాలా దుకాణాలు 25 ఏళ్లకు పైగా ఒకరిపేరుమీదే ఉన్నా పట్టించుకోలేదు. మునిసిపల్ చట్టాలు, జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు 25 ఏళ్లకు మించి లీజుకిచ్చేందుకు వీల్లేదు. 25 ఏళ్లు దాటితే లీజు రద్దవుతుంది. సదరు దుకాణాల్లోంచి లబ్ధిదారులను ఖాళీ చేయించాలి. జీహెచ్ఎంసీ ఎస్టేట్స్కు చెందిన మార్కెట్లు, కాంప్లెక్స్ల్లో ఈ గడువు ముగిసిపోయిన వారెందరో ఉన్నా వారిని ఖాళీ చేయించలేదు. వారినుంచి అద్దెలూ వసూలు చేయడం లేరు. నిర్ణీత లీజు గడువు ముగిసిపోయాక సైతం వారిని ఏమీ చేయలేకపోతున్నారు. దాంతో ఏళ్లకేళ్లుగా అలాగే కొనసాగుతున్నారు.
సిబ్బంది కొరత...
ఆయా దుకాణాల నుంచి అద్దెల వసూళ్ల బాధ్యతలు సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. సర్కిళ్లలో ఈ అద్దెలు వసూళ్లుచేసేందుకు సిబ్బంది లేరు. ప్రతి మార్కెట్కు ఒక మార్కెట్ ఇన్స్పెక్టర్, ఇద్దరు బిల్ కలెక్టర్లు ఉండాల్సి ఉండగా లేరు. ఆస్తిపన్ను వసూళ్లు చేసే బిల్కలెక్టర్లకే వివిధ సర్వేలు, ఓటర్ల జాబితాలు, ట్రేడ్లెసైన్సుల ఫీజులతోపాటు ఈ అద్దెల వసూలు బాధ్యతలు కూడా అప్పగించడంతో...పని ఒత్తిడిలో వారు వీటి గురించి పట్టించుకోవడం లేరు.
మరో వైపు...కొత్తమార్కెట్లు
గ్రేటర్ జనాభాకు తగినన్ని మార్కెట్లు లేనందున కొత్త మార్కెట్లు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ కొత్త మార్కెట్ల నిర్మాణానికి సిద్ధమైంది. కానీ. ప్రస్తుతం
స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
సికింద్రాబాద్ హరిహర కళాభవన్ షాపింగ్ కాంప్లెక్స్లో జీహెచ్ఎంసీ నిర్ణయించిన మడిగె అద్దె నెలకు రూ. 6 వేలు. ఏళ్ల క్రితం దాన్ని దక్కించుకున్న వ్యక్తి రూ.25 వేలకు మరొకరికి అద్దెకిచ్చారు. దాదాపు రూ. 4 లక్షలు డిపాజిట్గా కూడా తీసుకున్నారు. అందులో ప్రస్తుతం మెకానిక్ షాప్ నడుస్తోంది.మోండా మార్కెట్లో జీహెచ్ఎంసీ మటన్దుకాణం అద్దె రూ.570. అంతే విస్తీర్ణంలో సమీపంలో ఉన్న దుకాణం అద్దె రూ. 25 వేలు. చిక్కడపల్లి మునిసిపల్ మార్కెట్లో దుకాణం అద్దె రూ. 3000. అంతే విస్తీర్ణంలోని ప్రైవేట్ దుకాణం అద్దె అక్కడ రూ. 12,000 నుంచి 15,000 వరకు ఉంది.