
డీఆర్సీ ఎప్పుడో?
హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా స్థానిక మంత్రిని నియమించి పది నెలలు గడిచినా.. ...
► ఇన్చార్జి మంత్రిని నియమించి పదినెలలు గడిచినా..
► అభివృద్ధి సమీక్షపై అధికారగణం నిర్లక్ష్యం
► డబుల్ బెడ్ రూమ్... తాగు నీరే ప్రధాన సమస్యలు
► చర్చించే అవకాశం లేక ఇబ్బందులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా స్థానిక మంత్రిని నియమించి పది నెలలు గడిచినా.. ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధి కమిటీ(డీఆర్సీ) సమీక్ష సమావేశానికి మోక్షం లభించడంలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజల దరికి చేరుతున్నాయా..? లేదానన్న విషయాలతోపాటు అమలులో చోటుచేసుకుంటున్న లోపాలపై జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షించాల్సి ఉంటుంది. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయటానికి డీఆర్సీ సమావేశం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్టుగా వివిధ శాఖల అధికారుల పాత్ర ఉండే విధంగా డీఆర్సీ దోహద పడనుంది. ఈ కమిటీ సమావేశాన్ని మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు 40 లక్షల జనాభా దాటిన హైదరాబాద్ జిల్లాలో ప్రజలు ముఖ్యంగా తాగు నీరు, ఇళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.
డబుల్బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఇప్పటికి 1.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు, సరిపడు డాక్టర్లు, సిబ్బంది లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ)ను ప్రజల ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేయటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలున్నప్పటికీ డీఆర్సీ సమావేశాన్ని నిర్వహించక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాకు నలుగురు మంత్రులు
హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నాయిని నర్సింహారెడ్డిని నియమించి పది నెలలు గడిచినా, ఇప్పటి వరకు డీఆర్సీ సమావేశం జరగలేదు. ఈ జిల్లాలో మరో ముగ్గురు మంత్రులు మహామూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, టి.పద్మారావులు ఉన్నారు. వీరెవ్వరూ...డీఆర్సీ సమావేశాల నిర్వహణపై దృష్టి సారించటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే... జిల్లాలో సమస్యల ప్రాధాన్యత, ఉత్సవాలు, శాఖాపరమైన విషయాలు వచ్చేసరికి మాత్రం మంత్రులు ఎవ్వరికివారుగా సంబంధిత అధికారులతోపాటు జిల్లా అధికారులతో కలిపి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా సమస్యలకు సంబంధించి సమగ్ర చర్చ, అభివృద్ధిపై తగిన చర్యలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు
హైదరాబాద్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులైతే ఏడాదికి పార్లమెంటు సభ్యులకు రూ.5 కోట్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అయితే రూ.1.50 కోట్లు చొప్పున నిధులు విడుదలవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి నియోజకవర్గం అభివృద్ధి నిధుల్లో 50 శాతం నిధులను ఆయా నియోజకవర్గాల్లో వారు చేస్తున్న ప్రతిపాదనలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకునే వీలుండగా, మిగిలిన సగం నిధులు ఖర్చు చేయడానికి మాత్రం ఖచ్చితంగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి తీసుకోవాలి.