ధర్నాచౌక్‌ ప్రజల హక్కు: ఉత్తమ్‌ | Dharna Chowk is Right of People: Uttam | Sakshi
Sakshi News home page

ధర్నాచౌక్‌ ప్రజల హక్కు: ఉత్తమ్‌

May 16 2017 1:22 AM | Updated on Sep 19 2019 8:44 PM

ప్రజలకు ధర్నాచౌక్‌ను అందుబాటులో లేకుండా చేయాలనే ప్రభుత్వ కుట్ర దుర్మార్గమని, ధర్నాచౌక్‌ ప్రజల హక్కు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ధర్నాచౌక్‌ను అందుబాటులో లేకుండా చేయాలనే ప్రభుత్వ కుట్ర దుర్మార్గమని, ధర్నాచౌక్‌ ప్రజల హక్కు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ధర్నాచౌక్‌ ఆక్రమణ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొనడానికి ముందు టీపీసీసీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను అందుబాటులో లేకుండా చేయాలనే ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చందంగా ఉద్యమిస్తుంటే అదే సమయంలో ఇందిరాపార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌.., స్థానికుల నుంచి వ్యతిరేకత అని.. ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని విమర్శించారు.

రెండు వర్గాలకు ఏకకాలంలో అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దుర్మార్గమైన క్రీడకు తెరలేపిందని మండిపడ్డారు. స్థానికుల పేరుతో ప్రభుత్వం కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అక్కడికి పంపించిందని చెప్పారు. ధర్నాచౌక్‌కు వస్తున్న వారిపై దాడులకు ఉసిగొలిపి, హింసను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వమే దిగడం నీచమన్నారు. ధర్నాచౌక్‌ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజలతో చర్చించారని ఆయనవద్ద కూడా స్థానికులు అభ్యంతరాలు చెప్పలేదని అన్నారు. ధర్నా చౌక్‌ను నగరానికి దూరంగా తరలించడం.. ప్రజలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పాలకులు సరైన పాలన చేపడితే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.రాంమోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement