డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree student commits suicide cheating Constable | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Mar 10 2016 4:55 AM | Updated on Mar 19 2019 5:52 PM

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమపేరుతో ఓ కానిస్టేబుల్ చేసిన మోసానికి మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి కానిస్టేబుల్ నయవంచన

 ఇబ్రహీంపట్నం: ప్రేమపేరుతో ఓ కానిస్టేబుల్ చేసిన మోసానికి మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఇఫ్తకార్ అహ్మద్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పోర్ల తండాకు చెందిన అంగోత్ శారద (20) రెండేళ్లుగా తన తల్లితో కలసి ఇబ్రహీంపట్నంలోని రాంనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె నగరంలోని కోఠి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్  చదువుతోంది. యువతి సోదరుడు సంతోష్‌కుమార్ స్పెషల్ ప్రొటెక్షన్ విభాగంలో కానిస్టేబుల్‌గా రాజమండ్రిలో పనిచేస్తున్నాడు.

అతడి బ్యాచ్‌మెట్ అయిన నల్లగొండ జిల్లాకు చెందిన గుగులోత్ రాజేష్ తరచూ రాజేష్ ఇబ్రహీంపట్నంలోని సంతోష్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. దీంతో రాజేష్‌కు శారదతో పరిచయం ఏర్పడి.. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజేష్ యువతిని లొంగదీసుకున్నాడు. ఇటీవల అతడు శారదను వివాహం చేసుకోనని స్పష్టం చేశాడు. దీంతో తాను మోసపోయానని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ‘రాజేశ్ మోసం చేశాడు.. నేను బతికి మీకు చెడ్డపేరు తీసుకురాలేను..’ అని శారద బుధవారం సోదరుడికి ఫోన్ చేసి చెప్పి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement