లక్ష్యం...100 రోజులు | deadline for the implementation of welfare programs | Sakshi
Sakshi News home page

లక్ష్యం...100 రోజులు

Apr 5 2015 12:14 AM | Updated on Sep 2 2017 11:51 PM

లక్ష్యం...100 రోజులు

లక్ష్యం...100 రోజులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

సంక్షేమ కార్యక్రమాల అమలుకు డెడ్‌లైన్
{పత్యేక కార్యాచరణ ప్రణాళిక  సిద్ధం
జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సమాయత్తం
మరోవైపు ఎన్నికలకు కసరత్తు
డివిజన్ల సంఖ్య 150 నుంచి 200కు పెంపు

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓవైపు పార్టీ బలోపేతం... మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో 100 రోజుల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వేసవిలో నీటి కొరత రానివ్వకుండా చూసేందుకు మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఆదేశించారో లేదో... కొన్ని గంటల్లోనే జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులతో హరిత ప్లాజాలో శనివారం రోజంతా భారీ స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన వార్డులు/డివిజన్ల విభజనకు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచింది. ఓ వైపు ఈ ప్రక్రియ... మరోవైపు సంక్షేమ పథకాల అమలు సమాంతరంగా సాగాలన్నది అధికారుల యోచనగా తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో ప్రజలను ఆకట్టుకునే పథకాలకు వంద రోజుల ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా మహిళల మనసులు గెలిచేందుకు స్వయం సహాయక బృందాలకు రూ.1000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ అందజే సేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను స్పెషలాఫీసర్ ఆదేశించారు. పేదల బస్తీల్లో 1500 నీటి శుద్ధి కేంద్రాలు (ఆర్‌ఓ ప్లాంట్లు) ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని మరింతమందికి వర్తింపజేయనున్నట్టు ప్రకటించారు.

ఐదువేల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కల్పించాలని ఆదేశించారు. మరో ఐదువేల మంది నిరుద్యోగులను గుర్తించి... వారికి స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ లక్ష్యాల సాధనకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ లక్ష్యాలు...

వివిధ కాలనీలు, బస్తీల్లో 1000 ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తారు. వీటిలో దిన పత్రికలు, మ్యాగజైన్లతో పాటు, రెండేసి కంప్యూటర్లు ఉంటాయి. ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. నగరంలోని 200 మార్కెట్లకు మహర్దశ పట్టనుంది. వీటిని మోడల్ మార్కెట్లుగా ఆధునికీకరిస్తారు.డబుల్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్, టాయ్‌లెట్లతో కూడిన ఇళ్ల నిర్మాణానికి ఒక్కో నియోజకవర్గంలో రెండేసి బస్తీల (మొత్తం 48 ప్రాంతాలు) ఎంపిక.
     
యువత కోసం వెయ్యి జిమ్‌ల ఏర్పాటు. వాటిని స్వయంగా వారే నిర్వహించుకునేందుకు అవకాశం. వెయ్యి వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు. 1000 కి.మీ.ల మేర గ్రీన్‌కర్టెన్‌ల పేరిట ఫుట్‌పాత్‌ల వె ంబడి గోడల ఆధారంగా పెరిగే తీగెల వంటి మొక్కలు పెంచుతారు.{పతి సర్కిల్‌లోనూ ఒక దోబీఘాట్‌ను సకల వసతులతో అభివృద్ధి చేస్తారు.
 
283 ప్రభుత్వ ఖాళీ స్థలాల చుట్టూ ప్రహరీల నిర్మాణం. శ్మశాన వాటికల్లో మెరుగైన సదుపాయాలు. 177 శ్మశాన వాటికల్లో విస్తృతంగా మొక్కలు నాటి... వాటిని హరిత వనాలుగా తీర్చిదిద్దనున్నారు. రూ.5 భోజన కేంద్రాలు ఈ నెలాఖరులోగా మరో 50 ఏర్పాటు చేయాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement