
బడ్జెట్కు హాజరవుదామా.. వద్దా..?
బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో శాసనసభకు హాజరుకావడంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తర్జనభర్జన పడుతోంది.
కాంగ్రెస్ శాసనసభా పక్షం తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో శాసనసభకు హాజరుకావడంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తర్జనభర్జన పడుతోంది. టీడీపీ సభ్యులు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను సస్పెండ్ చేసినందుకు శాసనసభను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేతగా కె.జానారెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయడానికి అధికార పక్షం అంగీకరించలేదు. ఇది కాంగ్రెస్కు మరింత ఆగ్రహా న్ని కలిగిస్తోంది. దీంతో శాసనసభలో భోజనాలను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. అయితే సోమ వారం బడ్జెట్ ప్రవేశపెట్టననున్న నేపథ్యంలో సభలో అను సరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ తర్జనభర్జన పడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ సభలో ప్రధాన ప్రతిపక్షం హాజరుకాకుంటే, సభకు ప్రాధాన్యం, గౌరవం ఉండదని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో సభకు హాజరుకాకుంటే బాధ్యతారాహిత్యమనే విమర్శలు వచ్చే అవకాశముందని, బడ్జెట్లోని అంశాలను ప్రశ్నించే సమయంలోనూ ఇబ్బంది రావచ్చని సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభకు హాజరై, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై నిలదీయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు సూచించారు. అయితే ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ను పెట్టాలనుకుంటే అది ప్రభుత్వానికి కూడా తలవంపులేనని యువ ఎమ్మెల్యేలు వాదించారు.
ప్రధాన ప్రతిపక్షంతోపాటు ఇతర పార్టీల సభ్యులు కూడా లేకుండా బడ్జెట్ను ప్రవేశపెడితే ప్రభుత్వం అవమానంగా భావిస్తుందని, కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ముందుగా తెగేసి చెబితే ప్రభుత్వమే దిగొచ్చి, టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసే అవకాశముందని కొందరు వాదిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనకు ముందే శాసన సభలో ఈ సస్పెన్షన్ను ప్రస్తావించి, మరోసారి సభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సమంజసమని సీనియర్లు వాదించారు. చివరగా సభకు హాజరై, సస్పెన్షన్ను ఎత్తివేసేలా చొరవ తీసుకోవాలనే యోచనకు వచ్చినట్టుగా తెలిసింది.