చండీ రూపాలకు ఉద్వాసన | chandi idioms farewell completed by cm kcr | Sakshi
Sakshi News home page

చండీ రూపాలకు ఉద్వాసన

Dec 29 2015 3:24 AM | Updated on Aug 14 2018 10:54 AM

చండీ రూపాలకు ఉద్వాసన - Sakshi

చండీ రూపాలకు ఉద్వాసన

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ యాగం వైదిక ప్రక్రియలన్నీ సోమవారం పరిసమాప్తమయ్యాయి.

     ► యాగశాలలో వైదిక ప్రక్రియలు పూర్తి చేసిన కేసీఆర్ దంపతులు
     ► కుటుంబ సభ్యులతో కలసి వేములవాడ రాజన్న దర్శనం
     ► కోడె మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి
     ► సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం
 
 సాక్షి, హైదరాబాద్, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీ యాగం వైదిక ప్రక్రియలన్నీ సోమవారం పరిసమాప్తమయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన అయుత చండీ యాగం ఆదివారం నాటి పూర్ణాహుతితో పూర్తయింది. చండీ రూపాలైన మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి విగ్రహాల ఉద్వాసన కార్యక్రమం సోమవారం ఉదయం 11.55 నిమిషాలకు ఎర్రవెల్లిలోని యాగశాలలో ప్రారంభమయింది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్విజులు గోపికృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ, తంగిరాల శివకుమార్‌శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ ప్రక్రియలను పూర్తి చేశారు.

చండీ రూపాల ముందు నరసింహ హోమం నిర్వహించి దానికి సంబంధించిన పూర్ణాహుతి జరిపారు. కేసీఆర్ దంపతులు హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రుత్విజులు భారతీ తీర్థస్వామి ఆశీర్వాదం, చండీమాత శృతి తీర్థాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.

 రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
యాగశాలలో చండీ రూపాలకు ఉద్వాసన అనంతరం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి వేములవాడకు చేరుకున్నారు. తొలుత అక్కడ స్థానిక ఎమ్మెల్యే రమేష్‌బాబు గెస్ట్‌హౌస్ సంగీత నిలయానికి వెళ్లారు. అక్కడి నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డిలతో కలసి 2.45 గంటల సమయంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ ఈవో దూస రాజేశ్వర్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అనంతరం సీఎం కేసీఆర్ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత లక్ష్మీ గణపతి పూజ, రుద్రాభిషేకం, రాజేశ్వరీ అమ్మవారి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం చేశారు, ఆలయ అధికారులు పట్టువస్త్రాలు అందజేశారు. దాదాపు 45 నిమిషాలు ఆలయం లో గడిపిన కేసీఆర్... అనంతరం ఆలయం పక్కన ఉన్న చెరువు స్థలాన్ని సందర్శించారు. మినీ ట్యాంక్‌బండ్‌గా చెరువును తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో... దానికి సంబంధించి చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడినుంచి నేరుగా సంగీత నిలయానికి వెళ్లి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షిస్తారన్న సమాచారం మేరకు ఆలయ అధికారులంతా సంగీత నిలయానికి వెళ్లారు. కానీ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ ఉండటంతో సమీక్షా సమావేశాన్ని రద్దు చేసుకున్న సీఎం... 4.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు దేవస్థాన అనువంశిక అర్చకుడు ఈశ్వరగారి నరహరిశర్మ రూపొందించిన ‘శ్రీశివదీక్ష’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్ కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement