సాగర తీరం..పూల హారం | Celebrating Batukamma very Grand | Sakshi
Sakshi News home page

సాగర తీరం..పూల హారం

Oct 13 2013 3:48 AM | Updated on Sep 1 2017 11:36 PM

గునుగుపూలు, తంగెళ్లు, ముద్దబంతులు, చామంతులు, గడ్డిపూలతో సాగరతీరం పూలహారంగా మారింది. ఉయ్యాల పాటలు, బతుకమ్మ ఆటలతో హుస్సేన్‌సాగర్ తీరమంతా మార్మోగింది.

కవాడిగూడ,ఖైరతాబాద్, న్యూస్‌లైన్: గునుగుపూలు, తంగెళ్లు, ముద్దబంతులు, చామంతులు, గడ్డిపూలతో సాగరతీరం పూలహారంగా మారింది. ఉయ్యాల పాటలు, బతుకమ్మ ఆటలతో హుస్సేన్‌సాగర్ తీరమంతా మార్మోగింది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ పేరుతో శనివారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో పాల్గొని సందడిచేశారు.

సాయంత్రం 7 గంటలకు స్థానిక వివేకానంద విగ్రహం నుంచి డప్పుచప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనల మధ్య ప్రారంభమైన ర్యాలీలో వందలాది మంది మహిళలు అందంగా తయారు చేసిన తమ బతుకమ్మలను చేతపట్టుకొని ముందుకు కదిలారు. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌కు చెందిన గడీల వసంతవెంకట్రావు (రజిత) తీసుకొచ్చిన సుమారు 8 అడుగుల భారీ బతుకమ్మ విశేషంగా ఆకట్టుకోగా..ఈసీఐఎల్ నుంచి వచ్చిన మహిళలు సుమారు 4 అడుగుల గౌరమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ రాజరాజేశ్వరీ ఒగ్గుడోలు కళాకారులు, ఇతర డప్పు కళాబృందాలు, మహిళా కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను తమ కెమెరాల్లో బంధించుకునేందుకు విదేశీయులతోపాటు ఇటు యువతులు,యువకులు పోటీపడ్డారు. అనంతరం ‘పోయిరా బతుకమ్మ’ అంటూ సాగరంలోకి సాగనంపారు.  
 
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..: ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అంటూ భాగ్యనగర మహిళలు భక్తిపారవశ్యంలో సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. నెక్లెస్‌రోడ్‌లోని సాగర తీరమంతటా బతుకమ్మలను పేర్చిన వందలాదిమంది మహిళలు ఆడిపాడారు. అదనపు జాయింట్ కలెక్టర్ రేఖారాణి, ఆర్డీవో బి.నవ్య బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ఏజేసీ రేఖారాణి బహుమతులు అందజేశారు.
 
ఆకట్టుకున్న డప్పువాయిద్యాలు, నృత్యాలు: బతుకమ్మ సంబరాల్లో భాగంగా పీపుల్స్‌ప్లాజా రోటరీ చౌరస్తాలో విద్యుత్తుకాంతుల మధ్య ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల డప్పువాయిద్యాలతో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. సంప్రదాయ దుస్తులతో మహిళలు బొడ్డెమ్మలు, కూచిపూడి నృత్యాలు సందర్శకులను కట్టిపడేశాయి. మం త్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్‌లు సతీమణులతో సంబరాల్లో పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లక్ష్మీదేవి, ఖైరతాబాద్ కార్పొరేటర్ ఎస్.కె.షరీఫ్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement