
భూముల వేలాన్ని వెంటనే చేపట్టండి
రెండో విడత ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు.
అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ భూములను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ. 13,500 కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. తొలి విడత భూముల వేలంలో రూ.1,500 కోట్లకు మించి ఆదాయం రాలేదు. దీంతో ఈసారి భూముల వేలంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.
భూముల వేలంతో పాటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) విభాగానికి సంబంధించి ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. క్రమంగా యూఎల్సీ విభాగాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్పెషల్ ఆఫీసర్ల అధికారాలను వెంటనే కలెక్టర్లకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విభాగంలో అనేక సంవత్సరాలుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని సూచించారు.