10న జాతీయ రహదారుల దిగ్భంధం: ఏపీసీసీ | APCC pressmeet on AP special status issue | Sakshi
Sakshi News home page

10న జాతీయ రహదారుల దిగ్భంధం: ఏపీసీసీ

Sep 8 2016 6:53 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీసీసీ ఈనెల 10వ తేదీన జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఈ నెల 10వ తేదీన జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఇందిరాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ప్రధానకార్యదర్శి జంగా గౌతమ్, ఉపాధ్యక్షులు సూర్యా నాయక్, లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మలతో కలిసి మాట్లాడారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడులను ఉద్దేశించి రెండు ప్రశ్నలు వేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మార్చి1,2014న కేబినేట్ తయారు చేసిన బిల్లులో ఉందా లేదా?. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై రెండుసార్లు తీర్మానం ఎవరిని మోసగించేందుకు? అని ప్రశ్నించారు. బుధవారం ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు.

పార్లమెంటు సాక్షిగా ఓ మాజీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను.. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. గత పరిపాలకుల నిర్ణయాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు విలువేముంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement