పుట్టిన 48 గంటల్లోనే 'ఆధార్' | Aadhaar card for newborn babies | Sakshi
Sakshi News home page

పుట్టిన 48 గంటల్లోనే 'ఆధార్'

Jul 12 2016 6:03 PM | Updated on Oct 17 2018 3:53 PM

ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకూ పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రం త్వరలోనే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకూ పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రం త్వరలోనే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. తొలుత హర్యానాలో పైలెట్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఢిల్లీ అధికారులు మంగళవారం కుటుంబ సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలోనే జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికెట్) ఇచ్చే ఏర్పాటు చేసింది.

దీంతో పాటే ఆధార్ కార్డును కూడా ఇచ్చేందుకు ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 1700 మంది స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. వీళ్లందరికీ ఆధార్‌కు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను అమర్చిన ట్యాబ్‌లను ఇస్తారు. ప్రసవం జరిగిన వెంటనే బిడ్డతో పాటు తల్లి పేరునూ యాప్ ద్వారా టాబ్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలన్నీ జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌తో పాటు కేంద్రం నిర్వహిస్తున్న యూఐడీ (ఆధార్) సర్వర్‌కూ అనుసంధానిస్తారు.

తల్లి ఆధార్ నంబర్‌తో అనుసంధానం
బిడ్డ పుట్టగానే పేరు పెట్టకపోయినా ఆధార్ నంబర్‌ను ఇవ్వనున్నారు. ఈ నంబర్ 48 గంటల్లోనే ఇస్తారు. తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకున్నప్పుడు ఫొటో తీస్తారు. ఆ ఫొటోనే ఇక ఆధార్‌లో ఉండిపోతుంది. తొలుత 48 గంటల్లో నంబర్ ఇస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement