విజయవాడ: నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లను పబ్లిక్ టాయిలెట్స్ వదిలి వెళ్లిందో మహిళ. పసిపిల్లను తీసుకుని ఆటో ఎక్కిన ఓ మహిళ.. కృష్ణలంక స్టేషన్కి ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ వద్దకు వచ్చేసరికి ఆటో ఆపింది. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పిన సదరు మహిళ.. ఆ పసికందును ఆ టాయిలెట్లోనే వదిలేసి వెళ్లిపోయింది.
ఆ పసిప్రాణానికి బకెట్ అడ్డుగా పెట్టి అక్కడ నుంచి పరారైంది. అయితే బాత్ రూం కడిగేందుకు వెళ్లిన సమయంలో శానిటరీ సిబ్బంది ఆ పసిపిల్లను గుర్తించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆ పసికందును హుటాహుటీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పసిపాపను బాత్రూమ్లో వదిలేసిన తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్లినట్లు గుర్తించారు. అస్సలు ఆ మహిళ ఎవ్వరు?, ఎక్కడ ప్రసవించింది?...ఇక్కడ ఎందుకు వదిలేసింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


