రెండు రాష్ట్రాల మధ్య 9 అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులు | 9 check-posts between the two states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల మధ్య 9 అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులు

May 16 2014 2:27 AM | Updated on Jun 2 2018 2:56 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తొమ్మిది సమీకృత అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటునకు అధికారులు ప్రతిపాదించారు.

 పన్ను వసూలు చేయాలా వద్దా అనేది ఇద్దరు సీఎంల నిర్ణయానికే..
 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తొమ్మిది సమీకృత అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటునకు అధికారులు ప్రతిపాదించారు. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆ రోజు నుంచి ఈ తొమ్మిది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో రవాణా, వ్యాట్, ఎక్సైజ్ శాఖల పన్నులను వసూలు చేయనున్నారు.

అయితే వెంటనే పన్నులు వసూలు చేయాలా లేక ఆరు నెలలు లేదా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు పన్నులు వసూలు చేయకుండా ఉండాలా అనే దానిపై ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గవర్నర్ నర్సింహన్ నిర్ణయం తీసుకోని పక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి వదిలేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, కేంద్ర నిర్ణయం మేరకు నడుచుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

 జూన్ 20 వరకు వచ్చే వ్యాట్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ
 ప్రస్తుత మే నెలకు సంబంధించి వ్యాట్ ఆదాయం జూన్ 20వ తేదీ వరకు వ్యాపారస్తులు చెల్లించనున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఉమ్మడి రాష్ట్రంలో మే నెలలో వచ్చిన వ్యాట్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను అకౌంటెంట్ జనరల్‌కు అప్పగించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ వరకు వచ్చిన ఉమ్మడి రాష్ట్రం వ్యాట్ ఆదాయాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, సీమాంధ్రకు 52 శాతం అకౌంటెంట్ జనరల్ పంపిణీ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement