నగరంలోని రహమత్నగర్ సమీపంలోని సంతోషిగిరిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది.
బాలుడి అదృశ్యం.. విషాదాంతం
Oct 15 2016 11:26 AM | Updated on Jul 12 2019 3:29 PM
హైదరాబాద్: నగరంలోని రహమత్నగర్ సమీపంలోని సంతోషిగిరిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. సంతోషిగిరికి చెందిన రాంప్రసాద్ కుమారుడు సంతోష్(7) ఈనెల 12వ తేదీన స్నేహితుడు నరేష్(10)తో కలిసి పీర్ల పండుగను చూసేందుకు అల్లాపూర్ వెళ్లాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా సంతోష్ను రైలు ఢీకొట్టింది. దీంతో నరేష్ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పట్టాల పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న సంతోష్ను రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. కాగా, దీనిపై అతడి తండ్రి రాంప్రసాద్ ఈనెల 14వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే బాలుడి అదృశ్యం వార్త ‘సాక్షి’ దినపత్రికలో చూసిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి ద్వారా తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని, తమ కుమారుడిని చూసుకున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో సంతోష్ శనివారం ఉదయం కన్నుమూశాడు.
Advertisement
Advertisement