మాదిగల వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం అల్టిమేటం జారీ చేశారు.
మాదిగల వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం అల్టిమేటం జారీ చేశారు. ఈ నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై తీర్మానం చేయాలని, వర్గీకరణ చేపట్టాలని చంద్రబాబు ప్రధానికు లేఖ రాయాలని, పదో తేదీలోగా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.
తమ మూడు డిమాండ్లను పరిష్కరించకపోతే చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె నుంచి ‘ మాదిగల విశ్వరూప యాత్ర’మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 30న విజయవాడలో పది లక్షల మంది మాదిగలతో ‘ మాదిగల విశ్వరూప యాత్ర’ ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రలో చంద్రబాబును అడ్డుకున్న మాలలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, తెలుగుదేశంకు అండగా నిలిచిన మాదిగలను మాత్రం విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. మాదిగల వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు 20 ఏళ్లుగా చేయడంలేదని, ఇప్పుడు కాపులకు కూడా రిజర్వేషన్లు ఇస్తానని చెప్తూ వారిని కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు.