‘అరుణాచల్‌’ బస్సులు రోడ్డెక్కితే సీజ్‌

‘అరుణాచల్‌’ బస్సులు రోడ్డెక్కితే సీజ్‌


‘సాక్షి’ కథనంపై స్పందించిన సర్కారు

ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులపై కొరడా

కేంద్ర మోటారు వాహనాల చట్టం రూల్‌ ‘94’అతిక్రమించినందుకు చర్యలు

నేటి నుంచి అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలు  




సాక్షి, హైదరాబాద్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. బస్సుల అక్రమ వ్యవహారంపై ‘రద్దయినా రైట్‌ రాయ ల్‌’గా శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై స్పందించింది. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించి సీజ్‌ చేయాలని, ఇందు కోసం అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలని మంగళవారం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, అక్కడే పర్మిట్లు పొంది..  ఇక్కడే ట్రిప్పులు నిర్వహించడం కేంద్ర మోటా రు వాహనాల చట్టంలోని 94వ నిబంధనను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది.



అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్లు రద్దు..

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ దాదాపు వెయ్యి బస్సుల రిజి స్ట్రేషన్లు, పర్మిట్లను ఈ నెల 2న రద్దు చేసేశారు. ఆ బస్సులన్నీ పేరుకుమాత్రం అరుణా చల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, అక్కడి నుంచే జాతీయ పర్మిట్లు పొంది... తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ఉన్న టూ ప్లస్‌ వన్‌ బెర్తుల అమరిక తెలంగాణ రవాణా నిబంధనలకు విరుద్ధం. కానీ అవి అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ కావ డం, జాతీయ పర్మిట్లతో తిరుగుతుండడంతో.. ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలే కపోయారు.



 అయితే జూన్‌ 2న అరుణా చల్‌ప్రదేశ్‌ రవాణాశాఖ కమిషనర్‌ అలాంటి వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేశారు. ఇది జరిగి వారం రోజులైనా.. ఆ బస్సులు యథేచ్చగా రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఏదైనా రాష్ట్రంలో రిజి స్ట్రేషనైన వాణిజ్య వాహనాలు.. ఆ రాష్ట్రం భూభాగం మీదుగా కాకుండా పూర్తిగా ఇతర ప్రాంతాల్లో తిరగడం కేంద్ర రవాణాచట్టం నిబంధన 94కు విరుద్ధం. ఈ అంశాలను ఉటంకిస్తూ.. ‘రద్దయినా రైట్‌ రాయల్‌గా’అన్న శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.



 దీనిపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెంటనే స్పందించారు. మంగళవారం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, జేటీసీలతో సమావేశమై.. ‘అరుణాచల్‌’తరహా బస్సులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చారు. కేంద్ర రవాణా చట్టం నిబంధనలను అతిక్రమించిన బస్సులన్నింటినీ జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన, అనుమతులు పొందిన వాహనాలను గుర్తించి రూల్‌–94 ఉల్లంఘన జరిగినట్టు తేలితే అక్కడికక్కడే జప్తు చేస్తామని సమావేశం అనంతరం జేటీసీ రఘునాథ్‌ వెల్లడించారు.



ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి..

నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులను జప్తు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సంఖ్యలో అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ రమణారావుకు మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు.




 

Read also in:
Back to Top