అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన కామాంధుడికి గుంటూరు కోర్టు జీవిత ఖైదు విధించింది.
పిట్టలవానిపాలెం: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన కామాంధుడికి గుంటూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలివీ.. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు గడ్డంవారిపాలెం గ్రామంలో 2015 మార్చి 17 న ఇదే గ్రామానికి చెందిన చల్లాపల్లి ప్రభుదాసు(55) గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో అందరూ కూలీ పనులకు వెళ్ళడంతో చిన్నారుల ఇళ్ళలో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న చిన్నారులను ప్రభుదాసు సమీపంలోని బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అనంతరం కుటుంబంతోపాటు పరారయ్యాడు. కూలీపనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సరికి ఇద్దరు చిన్నారులు ఇంటి వద్ద మంచంపై పడుకుని ఉన్నారు. తల్లిదండ్రులు వచ్చి అడగడంతో తాతయ్య బాత్రూంలోకి తీసుకెళ్లి ఈ విధంగా చేశాడని ఏడుస్తూ చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని ప్రజా సంఘాలు హోరెత్తాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షులను విచారించి నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు ప్రభుదాసుకు జీవిత ఖైదు విధించినట్లు చందోలు ఎస్ఐ డి.చెన్నకేశవులు తెలిపారు.