అధునాతన యుద్ధతంత్రమూ... కర్రసామూ!

RSS plans towards war is old Strategy - Sakshi

అవలోకనం
ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు తమ క్యాడర్‌తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్‌ మిస్సైల్స్‌ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి.

రెండు దేశాల మధ్య కీలకమైన యుద్ధం జరిగి 15 ఏళ్లయింది. ఏకపక్షంగా జరిగిన ఆ దురాక్రమణ యుద్ధంలో సద్దాం హుస్సేన్‌ను అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ఓడించాడు. ఇరాకీ సైన్యం వద్ద ఉన్న కాలం చెల్లిన ట్యాంకులు, యుద్ధ విమానాలు అమెరికన్‌ సైనిక శక్తి ముందు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇరు దేశాల సైన్యాలు దాదాపు సమాన సంఖ్యలో –3,50,000 మంది సైనికులు– యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అమెరికా సైన్యంలో మరణాల శాతం ఇరాకీ సైన్యంతో పోలిస్తే 110వ వంతు మాత్రమే. అమెరికన్ల యుద్ధ సామగ్రి చాలా అధునాతనమైంది. 

ఆయాదేశాలు సైనిక సామగ్రిపై పెట్టే వ్యయాన్ని ప్రధానంగా ట్యాంకులు, యుద్ధ ఓడలు, యుద్ధవిమానాలకే వెచ్చిస్తుంటారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కేటాయించిన రక్షణ బడ్జెట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలను ఈ హర్డ్‌వేర్‌ పైనే వెచ్చిస్తున్నారు. అయితే ఇంత డబ్బు వెచ్చించి కొంటున్న ఆయుధ సామగ్రిని రిపబ్లిక్‌ డే పెరేడ్‌ వంటి సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఉపయోగించడం జరగదని చాలామంది సైనిక వ్యూహ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు ప్రధాన దేశాల మధ్య భవిష్యత్తులో జరగబోయే యుద్ధం 2003లో జరిగిన ఇరాక్‌ యుద్ధం కంటే భిన్నంగా ఉంటుంది. ఇరాక్‌ యుద్ధాన్ని 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో పోల్చి చెప్పవచ్చు. ఒక పక్షం మరొక పక్షాన్ని బలప్రయోగంతో ఒప్పించి తను కోరిందల్లా సాధించుకోవచ్చని అభిప్రాయపడినప్పుడే యుద్ధం జరుగుతుంది.

అయితే ఒక్కోసారి హింసతో పనిలేకుండానే ఎదుటి పక్షం మెడలు వంచడం సాధ్యపడవచ్చు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికన్‌ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. హిల్లరీ క్లింటన్‌ ఆ ఎన్నికల్లో ఓడిపోయి, డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొందాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భావించారట. ఈ వ్యవహారంలో రష్యన్లతో ట్రంప్‌ చేతులు కలిపారని ఆరోపణలు వచ్చాయి కూడా. పుతిన్‌ అతడి గూఢచారులు అమెరికన్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకుని ప్రభావితం చేశారని నిశ్చయంగా చెప్పవచ్చు.

ఫిబ్రవరి 16న ట్రంప్‌ న్యాయ శాఖ 13 మంది రష్యన్లపై నేరారోపణ చేసింది. వీరిలో చాలావరకు రష్యాలోని సెయింట్స్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలోని ఇంటర్నెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ అనే బృందానికి చెందినవారు. వీరు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌పై సోషల్‌ మీడియా ఖాతాలను తెరిచారు. వాస్తవానికి వాటిని రష్యా నుంచి నిర్వహిస్తున్నప్పటికీ అమెరికా నుంచి నిర్వహిస్తున్నట్లు కనిపించేవి. ఈ ఖాతాలు ట్రంప్‌కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడ్డాయని అమెరికన్లు నమ్ముతున్నారు. ట్రంప్‌ గెలవాలని రష్యా ఎందుకు భావించిందంటే, ప్రపంచంలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేసేలా హిల్లరీ క్లింటన్‌ ఆంక్షలను, విధించవచ్చని అనుమానించడమే. అమెరికాతో ఎలాంటి యుద్ధానికి వెళ్లకుండానే పుతిన్‌ తాననుకున్నది నెరవేర్చుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధమే వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం మూడురోజుల్లోపలే సైనిక బలగాలను మోహరింప జేయగలుగుతుందని, అదే భారత సైన్యానికి ఆరునెలల సమయం పడుతుందని ఆ సంస్థ అధిపతి మోహన్‌ భాగవత్‌ అన్నారు. భాగవత్‌ తన మిలీషియాను సరిహద్దులకు పంపిన తర్వాత అక్కడ అది ఏం చేస్తుందన్నదే నా ఆలోచన. చైనా సైనికులు పర్వతాల మీది నుంచి రైఫిళ్లను చేతుల్లో పట్టుకుని వస్తున్నట్లుగా 1962 నాటి యుద్ధ డాక్యుమెంటరీలను చూసిన తర్వాత భాగవత్‌ అలా ప్రకటించి ఉంటారా? మదర్‌ ఇండియాను రక్షించడానికి సంఘ్‌ అనుయాయులు ఏం చేస్తారనే అంశంపై భాగవత్‌ ఊహ ఏమిటి?

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు తమ క్యాడర్‌తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయా మం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్‌ మిస్సైల్స్‌ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి.

ఆధునిక రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మనకు కలిగే ముప్పు ఏదైనా ఉందంటే అది పోరాడే స్వచ్ఛంద సైనికులు లేకపోవడం వల్ల కాదు. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద సైన్యాలలో భారత్‌ సైన్యం ఒకటి. ఇక యుద్ధ సామగ్రి కొరత అసలే కాదు. ఎందుకంటే మనకు చాలినన్ని ట్యాంకులు, యుద్ధ విమానాలు లేవనడానికీ వీల్లేదు. తగిన టెక్నాలజీ లేకపోవడమే మన అసలు సమస్య. నిజానికి ఇదే ప్రాణాంతకమైన సమస్య. నేటి ఆధునిక రాజ్యం శత్రువు కమ్యూనికేషన్లను నిర్వీర్యం చేయడంమీదే ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇంటర్నెట్‌ను విచ్ఛిన్నపర్చి, బ్యాంకింగ్‌ వ్యవస్థను కుప్పగూలిస్తే గంటల్లోపే ఒక దేశాన్ని ముంగాళ్లమీదికి తీసుకురావచ్చు. 

సైనిక పరంగా చూస్తే కూడా, సరిహద్దుల అవతలినుంచి మన కమ్యూనికేషన్లపై దాడి జరిగితే చాలు దేశం రెక్కలు విరిగిపడినంత స్థితి నెలకొంటుంది. ఉదాహరణకు అమెరికన్ల ఆజమాయిషీలో ఉన్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్స్‌పై ఆధారపడుతున్నాం. దీన్ని అందుబాటులో లేకుండా చేస్తే మన యుద్ధ విమానాలు, క్షిపణులు కీలక సమయంలో పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో లక్షలాదిమంది తమ ప్రాణాలు ధారపోయడానికి సంసిద్ధత తెలిపినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అధునాతన సంపత్తి లేని దేశాన్ని శత్రువు ఎలాంటి హింసా లేకుండానే సులువుగా లొంగదీసుకోవచ్చు. నేడు యుద్ధతంత్రం మొత్తం దీనిపైనే నడుస్తోంది. దీన్ని అర్థం చేసుకోకపోవడం అనేది సమాచార లేమికి కాకుండా మన పరమ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంటుంది.

ఆర్‌ఎస్‌ఎస్, మన ప్రధానమంత్రితో సహా ఆ సంస్థ నుంచి తయారవుతున్న వ్యక్తుల ఆలోచనల నాణ్యతపై మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వల్లే నేను ఇలా రాయాల్సి వస్తోంది. ఈ ఆలోచన చాలా పురాతనమైనది. మరీ తేలికగా తీసుకుంటున్నారనిపిస్తుంది. దేశభక్తిని ఇలాంటి ఆలోచనలు, ప్రకటనలు రగుల్కొల్ప వచ్చు. దాని లక్ష్యంపట్ల సందేహించనవసరం లేదు. కానీ అలాంటి ఆలోచనల నాణ్యత ప్రమాద హెచ్చరికలు పంపుతోంది. అదే నన్ను భయపెడుతోంది కూడా.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్‌ పటేల్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top