మందు మానండోయ్‌ బాబు!

Special Story on Alcohol Drinking Health Issues - Sakshi

మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 200 కోట్ల మంది మద్యం తాగుతుంటారు. ప్రపంచంలోని మొత్తం జనాభాలో అంటే... 753.04 కోట్ల మందిలో ఇప్పుడు ఈ క్షణాన 0.7% మంది... అంటే దాదాపు 5 కోట్ల మంది మద్యం తాగుతూ ఉన్నారు. అంతగా మద్యం తాగుతూ ఉండటం వల్ల, దాని దుష్ప్రభావం వల్ల ప్రపంచ జనాభాలో ప్రతి 10 సెకండ్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇంతగా మనుషులను చంపేస్తున్నా ఆల్కహాల్‌కు ఎందుకు బానిస అవుతారంటే అది తాగగానే మనకు అది ఇచ్చే ఆహ్లాద భావన. ఆ ఆహ్లాదభావనను అలాగే కొనసాగించడం కోసం. కానీ ఆ ఆహ్లాద భావనే ప్రధాన సైడ్‌ఎఫెక్ట్‌గా మారి మనను అనేక రకాలుగా దెబ్బతీస్తుంది. తాగినవారికి తాత్కాలికంగానే హుషారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం బేజారు. ఆల్కహాల్‌తో కలిగే అనర్థాల గురించి అవగాహన కోసమే ఈ కథనం.

మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది కడుపులోకి వెళ్లాక జీర్ణమయ్యాక రక్తంలో కలుస్తుంది. కానీ ఆల్కహాల్‌ తాగగానే మన నోటిలోని మ్యూకస్‌ పొరల నుంచే నేరుగా రక్తంలో కలవడం మొదలైపోతుంది. కడుపులోకి చేరిన మద్యం కూడా జీర్ణం కాదు. కడుపులోంచి 20 శాతం, మిగతా 80 శాతం చిన్నపేగుల నుంచి రక్తంలో కలవడం మొదలవుతుంది.

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...
మనం ఆల్కహాల్‌ తాగినప్పుడు అది కేవలం సెకన్ల వ్యవధిలో మెదడుకు చేరడం మొదలవుతుంది. మద్యం తాగడం మొదలుపెట్టాక కేవలం ఆరు నిమిషాల్లో మెదడు కణాల్లోకి వెళ్తుంది. ఆ వెంటనే మన మెదడులోంచి డోపమైన్‌ అనే సంతోష రసాయనాలు బయటికి వస్తాయి. అవి మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. దాంతో ఒకరకమైన ఆనందం, ఆహ్లాదం, హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఇలా ఆనందం, ఆహ్లాదం కలగడానికి ‘గామా అమైనో బ్యుటిరిక్‌ యాసిడ్‌’ (గాబా) అనే ఓ న్యూరోట్రాన్స్‌మిటర్‌ కారణం. గాబా అనేది ఒక అమైనోయాసిడ్‌. ఇది మన మెదడులోని సిగ్నల్స్‌కు అడ్డుకట్ట వేసి మెదడు పని చేసే వేగాన్ని తగ్గిస్తుంది.  మనలోని ఇన్హిబిషన్లను తగ్గిస్తుంది. దాంతో ధైర్యం వచ్చిన భావన కలిగి, అంతకు ముందు విచక్షణతో ఆలోచించి, మనకు ప్రమాదకరమని అనిపించిన రిస్కీ పనులను సైతం తేలిగ్గా చేసేస్తుంటారు. దాంతో నిజానికి ఈ ఆనందాహ్లాదాలు, గాలితో తేలిపోవడాలు కలగడమే ఓ ప్రధాన సైడ్‌ఎఫెక్ట్‌ అన్నమాట. మద్యాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారన్న విషయం తెలిసిందే కదా. ఇలా పులియబెట్టినప్పుడు ఈ ‘గాబా’ మరింత ఎక్కువగా తయారవుతుంది. మొదట ఆహ్లాదం కలిగించిన ఈ ‘గాబా’యే మోతాదుకు మించి ఆల్కహాల్‌ తీసుకుంటున్నవారిలో మూర్చవ్యాధి (సీజర్స్‌), మాట, నడకలపై నియంత్రణ కోల్పోయే సెరిబెల్లార్‌ డీజనరేషన్‌ డిసీజ్, యాంగై్జటీ, పానిక్‌ డిజార్డర్, డిప్రెషన్‌ వంటి అనేక మూడ్‌ డిజార్డర్స్‌కు కారణమవుతుంది. మద్యం తాగేవారి పిల్లలకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వంటి వ్యాధులూ వచ్చే అవకాశం ఉంది.

ఇక మద్యం ఏదైనప్పటికీ పులిసే క్రమంలో కొన్ని పదార్థాలు వెలువడతాయి. వాటిని ‘కంజీనర్స్‌’ అంటారు. ఆల్కహాల్‌ తాగినప్పుడు మనం ఒక పదార్థం తాలూకు అసలు రుచినీ, వాసననూ పసిగట్టలేం. రంగును
గుర్తించలేం. ఈ కంజీనర్స్‌ అనేవి రంగు, రుచి, వాసనలతో పాటు ఇంకా అనేక అంశాలను పసిగట్టనివ్వని విధంగా ఫిల్టర్స్‌లా పనిచేస్తాయి. దాంతో మనం స్పృహలో ఉన్నప్పుడు ఏమాత్రం ఇష్టపడనివీ, మనకు హాని చేసే పదార్థాలనూ తాగినప్పుడు నిస్సంకోచంగా తీసుకుంటూ ఉంటాం.

ఏయే మోతాదుల్లో ఏయే మార్పులు
హుషారుగా ఉండటానికి చేసే మద్యపానంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్‌. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎంఎల్‌.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం కాస్త దుడుకుతనం కలుగుతాయి. అదే హుషారును కొనసాగించడానికి వ్యక్తులు మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే అదే మద్యం కాస్తా 80 ఎం.ఎల్‌. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. అవి... తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్‌.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. రోడ్‌రేజ్‌ వంటివి ఈ సమయంలోనే చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు అవి నేరాలకూ దారితీస్తాయి. బాగా మద్యం తీసుకొని ఉన్న సమయంలో వ్యక్తి జడ్జ్‌మెంట్‌ కోల్పోతాడు. దాంతో దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు  మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. తీసుకోవాలనుకున్న మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని ఒక వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు.

మొదటి చిన్న చిన్న మోతాదులకు, దాంతో వచ్చే ఆహ్లాద భావనలకు ఆకర్షితమై మొదలుపెట్టే ఈ సరదా... క్రమంగా పెరుగుతూ పోతుంది. అందుకే సరదాగా మద్యం తాగే అలవాటు ఉన్నవారు సైతం మొదట్లోనే దాన్ని వదిలేయడం చాలా మంచిది. ఒక దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించే ఈ అలవాటును మొగ్గలోనే తుంచేయడం అవసరం కూడా.

ఎన్ని విధాలా నష్టం అంటే  
మద్యం శరీరంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుందని చెప్పుకున్నాం కదా. మన ఒంట్లో దాని వల్ల నష్టపోని వ్యవస్థలు, కీలక భాగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు కొన్ని వాస్తవాలు
♦ జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్‌), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్‌ అబ్జార్‌ప్షన్‌ సిండ్రోమ్‌), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్‌ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. 75% ఈసోఫేజియల్‌ క్యాన్సర్లకు కారణం మద్యం తాగడమే.
♦ గుండె: ఆల్కహాల్‌ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు. గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్‌ సమస్యలు.
♦ నాడీ వ్యవస్థలో లోపాలు: జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు.
♦ సెక్స్‌ సమస్యలు: సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు.
గర్భిణులు ఆల్కహాల్‌ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు.
మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక విటమిన్‌ లోపాలకు కారణం అవుతుంది.
♦ ప్రమాదాలు: మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్‌ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో బతికినప్పటికీ ఒక్కోసారి తలకు తీవ్రమైన గాయాల వల్ల జీవితాంతం వైకల్యంతోనే జీవించాల్సి వచ్చే అవకాశాలే ఎక్కువ.

మానేసిన వెంటనే ఆరోగ్య ప్రయోజనాలు
ఇంతటి నష్టాన్ని కలిగించే మద్యం మానేయగానే మన శరీరం బాగుపడటం మొదలవుతుంది. మద్యం మానేయగానే కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే కాలేయం పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. భవిష్యత్తులో కాలేయ వ్యాధుల ముప్పు తొలగిపోతుంది. రక్తపోటు తగ్గుతుంది. డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.5% క్యాన్సర్లు మద్యం కారణంగానే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక పేర్కొంటోంది. అందుకే దాన్ని గ్రూప్‌–1 కార్సినోజెన్‌గా చెబుతోంది. అంటే మద్యం మానేయడం వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్ల ముప్పు తొలగిపోతుందని అర్థం. అంతేకాదు.. ఆల్కహాల్‌ మానేసి, బరువును అదుపులో పెట్టుకొని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటే క్యాన్సర్లు వచ్చే ముప్పు 30 శాతానికి పైగా తగ్గుతుంది. అయితే దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారు అకస్మాత్తుగా ఆపేసినప్పుడు ఆల్కహాల్‌ విత్‌డ్రావల్‌ సిండ్రోమ్‌ అనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో పొంతనలేకుండా మాట్లాడటం, గుండె వేగంలో మార్పులు, భయం, వణుకు, ఆందోళనతో పాటు కొన్ని సార్లు ఫిట్స్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి తాత్కాలికమే. ఒకటి నుంచి రెండు వారాల్లో మామూలైపోతారు.

మద్యం సరదాగా తాగే అలవాటు ఉన్నా సరే... దాన్ని తక్షణం మానేయండి. ఇక దీర్ఘకాలిక మద్యపాన ప్రియులు కూడా పైన పేర్కొన్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని మానేయడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలికంగా మద్యం అలవాటు ఉన్నవారిలో మానేయాలనే దృఢసంకల్పం ఉన్నప్పుడు అలాంటి వారికి డాక్టర్ల ఆధ్వర్యంలో కొద్దిపాటి చికిత్సతో మద్యాన్ని మాన్పించడం సులువే.

మద్యం గురించి అవీ ఇవీ...
మనిషి కొత్తరాతి యుగం నాటి (10,000 బీసీ) నుంచి ఆహారపదార్థాలను పులియబెట్టి మద్యం తయారు చేయడం నేర్చుకున్నాడు. చైనాలో 7000 బీసీలో కూడా మద్యం తయారు చేసిన తార్కాణాలున్నాయి. పిరమిడ్‌ల నిర్మాణంలో కూలీలకు బీర్లను వేతనంగా ఇచ్చిన దాఖలాలూ ఉన్నాయి.
కొందరైతే తమ గ్లాసు ఖాళీ అవ్వగానే ఆ ఖాళీ గ్లాసును చూసి కూడా భయపడతారూ, ఆందోళనపడతారు. ఆ భయాన్నే ‘సీనోసిలికఫోబియా’ అంటారు. ఆ భయాన్ని అధిగమించడం కోసం వెంటనే తమ ఖాళీగ్లాసు నింపేస్తుంటారు.
అమెరికాలోని ఒహాయోలో చేపకు మద్యం తాగించడం చట్టబద్దమైన నేరం.
ఒక రోజు అలగ్జాండర్‌ తన సైనికులకు మద్యం తాగే పోటీని నిర్వహించాడు. పోటీ ముగిసే సమయానికి పటాలంలోని 42 మంది సైనికులు మద్యం విషప్రభావం కారణంగా (ఆల్కహాల్‌ పాయిజనింగ్‌తో) చనిపోయారు.
ఐర్లాండ్‌లో 1875లో ఒక మద్యం తయారీ సంస్థలో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడా మద్యం పరిశ్రమ నుంచి మద్యం ఏరులై వీధుల్లో ప్రవహించింది. అలా ఫ్రీగా మద్యం పారుతుంటే వృధాకానివ్వకూడదంటూ చాలామంది మద్యం ప్రియులు అదేపనిగా తాగడం మొదలుపెట్టారు. అలా తాగేసిన వారిలో 13 మంది మద్యం దుష్ప్రభావంతో (ఆల్కహాల్‌ పాయిజనింగ్‌తో) చనిపోయారు.
లేత రంగు మద్యాల్లో కంటే ముదురు రంగు (డార్క్‌) మద్యాల్లో ఆల్కహాల్‌ మోతాదులు చాలా ఎక్కువ. ఇక మన ఆసియా దేశాల వారిలోని 50% మందిలో ఆల్కహాల్‌ తాగితే దాన్ని తట్టుకొని ప్రాసెస్‌ చేయగల జన్యువు లేదు. అందుకే పాశ్చాత్య దేశాల కంటే మన ఆసియా దేశాల వారిలో మద్యంతో మరింత ముప్పు.

కాలేయంపైనే అధిక దుష్ప్రభావం...
శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒకరకమైన విషం (టాక్సిన్‌) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అలా కాలేయం ఆల్కహాల్‌ విరిచేస్తున్న క్రమంలో ఎసిటాల్డిహైడ్, ఎసిటేట్‌ అనే రసాయనాలు వెలువడుతుంటాయి. ఈ రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. నిజానికి ఆల్కహాల్‌ తాగిన మర్నాడు మనిషి హ్యాంగోవర్‌కు గురవుతాడు. ఇందుకు ఆల్కహాల్‌ను విరిచేసే క్రమంలో వెలువడే ఎసిటాల్డిహైడ్, ఎసిటేట్‌లతో పాటు ఇతర రసాయన బైప్రోడక్ట్సే  కారణం. అవి విషపూరితమైనవి కావడం వల్ల ఆ విషాల ప్రభావంతో మనిషి మందకొడిగానూ, చిరాకుగానూ మారిపోయి, తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేకపోతాడు. ఇలా విషాలను విరిచేసే పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై చాలా భారం పడుతుంది.

మెదడుపై దుష్ప్రభావం ఇలా...
ప్రధానమైన దెబ్బ కాలేయంపైనా... ఆ తర్వాత మెదడుపైన పడుతుంది. మద్యం మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఎక్కువ మోతాదుల్లో మద్యం తీసుకున్నప్పుడు అది మెదడులోని ప్రీ–ఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి ఆ భాగమే తోడ్పడుతుంది. అదే సరిగా పనిచేయకపోవడంతో మనం మెల్లగా మన భావోద్వేగాలపై అదుపు కోల్పోతాం. ఎలాంటి ముప్పునైనా తేలిగ్గా  తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడంతో రిస్క్‌ తీసుకునే పనులకు పాల్పడుతుంటాం. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. అటు తర్వాత మెదడులోని  టెంపోరల్‌ లోబ్‌ ప్రభావితమవుతుంది. ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. చివరకు చిరాకు, కోపం కలుగుతాయి. నిజానికి ఆల్కహాల్‌ అనేది  డిప్రెషన్‌లోకి నెట్టే ఒక డిప్రెస్సెంట్‌. అది మనిషిని కుంగిపోయేలా చేస్తుంది. అంతేకాదు... మెదడు పనితీరు, చురుకుదనం తగ్గుతాయి. అలాగే మితిమీరి తాగుతూ ఉంటే ఆ తర్వాతి దశ కోమాయే. ఎంత మోతదులో ఎలాంటి మార్పులు కలుగుతాయో విపులంగా చెప్పుకుందాం.

ఏయే మోతాదులు... ఎలాంటి పరిణామాలు /లక్షణాలు

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి,చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్,హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top