మెరుగైన భారతీయుల ఆయుప్రమాణం
సాక్షి,న్యూఢిల్లీ: భారతీయుల జీవనశైలి ఆందోళనకరంగా మారినా గత మూడు దశాబ్దాలుగా మెరుగైన వైద్య విధానాలతో సగటు ఆయుప్రమాణం వృద్ధి చెందింది. 1990తో పోలిస్తే దేశ పౌరుల సగటు ఆయుప్రమాణం గణనీయంగా పెరిగిందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ అథ్యయనం వెల్లడించింది. దేశంలోనే కేరళ అత్యంత ఆరోగ్యకర రాష్ర్టంగా ఈ అథ్యయనం తేల్చింది. 1990లో మహిళల జీవితకాలం 59.7 ఏళ్ల నుంచి 2016లో ఏకంగా 70.3 సంవత్సరాలకు పెరగ్గా, పురుషుల్లో 1990లో 58 ఏళ్ల నుంచి ప్రస్తుతం 66.9 ఏళ్లకు సగటు ఆయుప్రమాణం పెరిగిందని అథ్యయనం పేర్కొంది.
ఇక కేరళలో పురుషుల సగటు జీవనకాలం 73.8 శాతంగా ఉండగా అస్సాంలో కేవలం 63.6 సంవత్సరాలుగా అంచనా వేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో స్ర్తీల ఆయుప్రమాణం జాతీయ సగటు కన్నా తక్కువగా కేరళ మగువల కన్నా 12 ఏళ్లు తక్కువగా 66.8 ఏళ్లుగా నమోదైంది. మూడు దశాబ్ధాలుగా భారత్లో సగటు ఆయుప్రమాణం గణనీయంగా మెరుగైనా చైనా, శ్రీలంకతో పోలిస్తే 11 ఏళ్లు తక్కువగా ఉండటం గమనార్హం.