ఢీ అంటే ఢీ
ఐర్లండ్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలో అంటే.. ఫిబ్రవరి 8న. అదే తేదీకి మన దగ్గర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీకి, ఐర్లండ్కి సంబంధం ఏమీ లేదు. అయితే ఐర్లండ్కు, ఇండియాకు ఒక సంబంధం ఉంది. రెండు దేశాల జాతీయ జెండాలోని మూడు రంగులూ ఒకేలా ఉంటాయి. సరే, సంగతేమిటంటే.. ఐర్లండ్లో కార్క్ సౌత్–వెస్ట్ నియోజకవర్గానికి నువ్వా నేనా అన్నట్లుంది పోటీ. అలా.. నువ్వా నేనా అంటున్నది.. భార్యాభర్తలు. భార్య హోలీ కెయిర్న్స్ సోషల్ డెమొక్రాటిక్స్ పార్టీ తరఫున, ఆమె భర్త క్రిస్టఫర్ ఓ సల్లీవన్ ఫియాన్నా ఫాల్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు.
భర్త పార్టీ బలమైనది. అయినప్పటికీ అతడు ఓడిపోయి, భార్య గెలిస్తే.. ఆమె పార్టీ కన్నా, ఆమే బలవంతురాలు అని నిర్ధారణ అవుతుంది. అయినా.. ఒకే స్థానానికి ఒకే ఇంట్లోని వాళ్లు నిలబడ్డం ఏంటి.. అని అడిగేవాళ్లు అడుగుతున్నా.. ఈ దంపతులు చెప్పవలసిన మాటే చెబుతున్నారు. ప్రేమలో, యుద్ధంలో ఏదైనా కరెక్టేనట! అయితే గెలుపు ఓటములు కూడా వీళ్లకు ఒకటే కాబోతున్నాయన్న మాట.