శక్తి మేరకు కట్టుబాటు | Sakshi
Sakshi News home page

శక్తి మేరకు కట్టుబాటు

Published Fri, Sep 7 2018 12:09 AM

British police arrested and imprisoned in a case of treason - Sakshi

ఆంగ్లేయుల కాలంలో ఓ మసీదు ఇమామ్‌ సాబ్‌ ను బ్రిటీషు పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు. ధార్మికంగా నిష్టగా ఉండే ఇమామ్‌ గారికి జైలులో నమాజు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ శుక్రవారం జుమా నమాజు కోసం మసీదుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. బ్రిటీషు పోలీసులు అనుమతిచ్చేవారు కాదు. అయినప్పటికీ జుమా నమాజు కోసం తలంటు స్నానం చేసి సిద్ధమయ్యేవారు. జుమా నమాజు అజాన్‌ వేళయిందంటే చాలు అజాన్‌ పిలుపు వినేందుకు ఎంతో ఆతృతతో జైలు ప్రవేశ ద్వారం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జైలు ఇనుప చువ్వలు పట్టుకుని నిల్చునే వారు. అజాన్‌ పలుకులు పూర్తిగా విన్న తరువాతనే తన జైలు గదిలోకి వెళ్లి కూర్చునేవారు. ఆయన ప్రతీసారీ శుక్రవారం ఇలానే చేసేవారు. ఎన్నో శుక్రవారాలపాటు  ఈ వ్యవహారమంతా గమనించిన జైలరు గారు ఒకరోజు హాఫిజ్‌ గారిని తన గదికి పిలిపించుకుని ‘‘ఈ జైలు పరిసరాలనుంచి నువ్వు బయటికెళ్లలేవని తెలిసి కూడా ప్రతి శుక్రవారం నమాజు కోసం సిద్ధమయ్యి గేటు దగ్గర అలా ఎందుకు ఎదురు చూస్తుంటావు’’ అని అడిగారు.

దానికి ఇమామ్‌ సాబ్‌ ‘‘జైలరు గారూ, శుక్రవారం అజాన్‌ వినగానే పనులన్నీ పక్కనపెట్టి నమాజు కోసం బయలుదేరాలన్నది నా ప్రభువు ఆజ్ఞ. నా శక్తిమేరకు నా ప్రభువు ఆజ్ఞకు కట్టుబడి ఉన్నానని అనుకుంటున్నాను. నా ఈ పరిస్థితిని చూసి అల్లాహ్‌ తన దాసుల జాబితాలో నాపేరును తప్పకుండా నమోదు చేసుకుంటాడు. ఎందుకంటే అల్లాహ్‌ ఎవ్వరి పైనైనా శక్తికి మించిన భారం మోపడు. అల్లాహ్‌ నాకు తప్పకుండా శుక్రవారం నమాజు పుణ్యాన్నిస్తాడు. నా ఈ ఆచరణ కేవలం అల్లాహ్‌ ప్రసన్నత కోసమే’’ అని చెప్పాడు! జైలరు గారు ఆశ్చర్యపోయారు. ప్రతీ భక్తుని ఆలోచనా దృక్పథం ఇలానే ఉండాలి. మనం మన పరిధిలో, మన శక్తిమేర ధర్మంపై నిలకడను ప్రదర్శించాలని, ధర్మాజ్ఞలకు కట్టుబడేందుకు కృషిచేయాలని ఈ గాథ తెలియజేస్తోంది
– నాజియా

Advertisement
Advertisement