మేయర్.. ఎవరు | who is the Mayor | Sakshi
Sakshi News home page

మేయర్.. ఎవరు

Mar 19 2014 3:27 AM | Updated on Mar 18 2019 9:02 PM

కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన తర్వాత తొలి మేయర్ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ రెండోసారి తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన తర్వాత తొలి మేయర్ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ రెండోసారి తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను జాగ్రత్తగా చేపట్టినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే మేయర్ ఎంపికలో మాత్రం ఆ పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 2009 అసెంబ్లీ కోల్పోయిన నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు పట్టుదలతో నాయకులు ప్రణాళికలు రూపొందించటంలో నిమగ్నమయ్యారు.

 నగరంలో మూన్నూరుకాపు ఓట్ల తర్వాత అధికంగా ఉన్న వైశ్యుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. మేయర్ పదవి స్థానాన్ని వైశ్యకులస్తులకు కట్టబెట్టి ఆ వర్గం మొత్తం ఓట్లు రాబట్టుకోవాలన్నా ఆలోచనతో ముందడుగు వేస్తోంది. మేయర్ పదవి వైశ్యులకు ఇవ్వాలన్న పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ నిర్ణయం మేరకు ఆ కులానికి చెందిన ఇద్దరు మహిళ అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇందులో 10వ డివిజన్ నుంచి గజవాడ శైలజ, 47వ డివిజన్ నుంచి సుజాత ఉన్నారు. గత ఎన్నికలో 10వ డివిజన్ నుంచి గజవాడ గణేష్‌గుప్తా పోటి చేసి కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా,ప్రస్తుతం 47వ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన మంజుల కుటుంబం డీఎస్‌కు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే వీరిలో విద్యావంతురాలు, నెమ్మదస్తురాలైన శైలజ వైపే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

 బీజేపీలో నాంచారి శైలజకే
 బీజేపీ తరపున మేయర్ అభ్యర్థిగా మున్నూరుకాపు వర్గానికి చెందిన నాంచారి శైలజ పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పాటు ఇటీవల నగరంలో బీజేపీ కూడా పుంజుకోవటంతో నగరంలో గతంలో కంటే మెరుగైన స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ  ఆశించిన స్థానాలు రానట్లయితే,  స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేసి, ఎలాగైనా మేయర్ పదవిని కైవసం చేసుకునే విధంగా అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు.

 గులాబీదళం నుంచి సూదం లక్ష్మి
 టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మేయరు అభ్యర్థిగా నిన్నటి వరకు పద్మజను అనుకున్నారు. కాని ఆమె తన నామినేషన్ ఉపసంహరించుకోవటంతో ఆ పార్టీకి మేయర్ అభ్యర్థి కరువయ్యారు. నగరంలో టీఆర్‌ఎస్‌కు మేయర్ పదవి చేపట్టే సంఖ్యాబలం ఉంటే పార్టీలో సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ సూదం లక్ష్మీ పేరు వినిపిస్తోంది. ఈమె కూడా మున్నూరుకాపు కులానికి చెందినవారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement