టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్ | TDP will score only 40 seats in Seemandhra: YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్

Apr 28 2014 12:22 PM | Updated on Aug 10 2018 8:06 PM

టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్ - Sakshi

టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్

సీమాంధ్రలో తమ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఎన్డీ టీవీ సీఈవో ప్రణయ్‌ రాయ్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు.

హైదరాబాద్ : సీమాంధ్రలో తమ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఎన్డీ టీవీ సీఈవో ప్రణయ్‌ రాయ్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. సీమాంధ్రలోని 175 సీట్లలో టీడీపీకి 40 సీట్లు కూడా రావన్నారు. సీమాంధ్రకు హైదరాబాద్‌ను దూరం చేసి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి ఇంజిన్‌లాంటి హైదరాబాద్‌ను తొలగించి సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు.    

ప్రణయ్‌రాయ్‌: ఎన్నికల ప్రచారంలో ఇలాంటి భావోద్వేగ వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. మీకు ఇది అంత పట్టున్న ప్రాంతం కూడా కాదు. సీమాంధ్రలో కన్నా.. ఎక్కువ ఎమోషన్ కనిపిస్తోందా?
వైఎస్‌ జగన్‌: సీమాంధ్రలో ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది


ప్రణయ్‌రాయ్: రాయలసీమలో కూడా ఇంతేనా?
వైఎస్‌ జగన్‌: రాయలసీమైనా... కోస్తాంధ్ర అయినా పెద్దగా తేడా ఉండదు. రెండు ప్రాంతాలు కూడా ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటాయి. శ్రీకాకుళం నుంచి చివరివరకూ ఒకేరకమైన ధోరణి కనిపిస్తుంది. అధికారంలో వచ్చే ఏపార్టీ అయినా.. క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుంది. తమిళనాడు తరహా రాజకీయ ప్రవర్తన కనిపిస్తుంది. కాని తెలంగాణలో దీనికి భిన్నంగా ఉంటుంది.

మెజార్టీ సీట్లు సాధించే ఏపార్టీకూడా సగానికిపైగా సీట్లు సాధించే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ కేవలం 26 సీట్లు మాత్రమే సాధించింది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 10 సీట్లే వచ్చాయి. సీమాంధ్రలో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్లీన్‌ స్వీప్‌ ఉంటుంది. ఆప్రాంతంలో రాజకీయ ధోరణి అలానే ఉంటుంది. గడచిన 30 ఏళ్ల ఫలితాలను చూస్తే... ఇదే తెలుస్తుంది.

ప్రణయ్‌ రాయ్‌: మీరు ఎన్ని నెలలనుంచి ఇలా ర్యాలీలు, రోడ్‌షోలు చేస్తున్నారు?
వైఎస్‌ జగన్: గడచిన నాలుగు సంవత్సరాలు నేను ఇవి చేస్తూనే ఉన్నా...

ప్రణయ్‌రాయ్‌: ప్రత్యేకించి మహిళలు... మరింత భావోద్వేగాలను చూపుతున్నారు?
వైఎస్‌ జగన్‌ : మిగతావారితో పోలిస్తే.. మహిళలు నన్ను హృదయపూర్వంగా ఆశీర్వదిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతలు.

ప్రణయ్‌రాయ్‌: బీజేపీ, టీడీపీల పొత్తు.. కొంతశాతం మైనార్టీ ఓటర్లను మీకు దూరంచేస్తుందంటారా?

వైఎస్‌ జగన్‌: బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా.. లేకున్నా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఓటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ , టీడీపీ పొత్తు వల్ల పెద్దగా మార్పు ఉండదు. కాకుంటే ఒకటి రెండు శాతం ఓట్లలో తేడా ఉండొచ్చు. కాని, ఈతేడా ఓట్లు, సీట్లుగా మారవు. సీమాంధ్రలో బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎలాంటి సీట్లూ రావు. 175 సీట్లలో టీడీపీ 40 సీట్లు దాటదు.

ప్రణయ్‌రాయ్‌: మీరు కూడా ఎన్నికల గణాంకాల విశ్లేషకులే. మీరు కూడా ఎవరికెన్నిసీట్లో చెప్తున్నారు. మీ ఆలోచనల్లో... మీ భావాల్లో మీనాన్న ఎక్కువ కనిపిస్తున్నారు?
వైఎస్‌ జగన్‌: ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారు. కారణం ఏంటంటే.. ఆయన చాలా చేశారు. ఆయన వదిలివెళ్లిన ప్రేమాభిమానాలను ప్రజలు చూపిస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చేసారికి తమ సొంత ఇంటి మనిషిలా చూస్తున్నారు. సొంత కొడుకుగా, మనవడిగా, సొంత తమ్ముడిగా, అన్నగా నన్ను అభిమానిస్తున్నారు. ఇదంతా నాన్న చేసినదానివల్లే. దాన్ని నిలబెట్టుకుంటానని, మరింత మెరుగ్గా సేవలందిస్తానని వారికి మరింత భరోసానివ్వాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement