అవినీతిపై విచారణకు సిద్ధమా?: వైఎస్ విజయమ్మ | is Chandrababu Naidu ready to face investigate on coruption ? | Sakshi
Sakshi News home page

అవినీతిపై విచారణకు సిద్ధమా?: వైఎస్ విజయమ్మ

Apr 17 2014 3:01 AM | Updated on Sep 2 2017 6:07 AM

‘తన హయాంలో ప్రజలకు తినడానికి తిండి కూడా పెట్టని చంద్రబాబు ఇప్పుడు జనానికి అన్నీ చేసేస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.

 చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘తన హయాంలో ప్రజలకు తినడానికి తిండి కూడా పెట్టని చంద్రబాబు ఇప్పుడు జనానికి అన్నీ చేసేస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. తొమ్మిదేళ్ల పాలనలో తాను చేసిన స్కాములపై విచారణ జరక్కుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని బతుకుతూ ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నాడు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభ ల్లో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పుడే హైదరాబాద్ నగరం దేశంలో మూడో స్థా నంలో ఉందని.. కానీ తానే హైదరాబాద్‌ను నిర్మించానని చెబుతూ అందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు.
‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములమయం కాదా? ఆ స్కాముల కేసుల్లో నువ్వు స్టేలు తెచ్చుకుని బతకట్లేదా? ఆ  కుంభకోణాలు, నీ అవినీతిపై విచారణకు సిద్ధమా చంద్రబాబూ? ఏలేరు కుంభకోణం, మద్యం, స్కాలర్‌షిప్‌ల కుంభకోణాలు, నకిలీ స్టాంపులు, నీరు-మీరు పథకం.. ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిన ఘనుడవు నీవు. వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని నీ బినామీలకు చెందిన ఐఎంజీకి అతి తక్కువ ధరకే కట్టబెట్టావు. 850 ఎకరాల భూమి అప్పట్లోనే రూ.1650 కోట్లు ఉంటే.. నేడు అది రూ.16 వేల కోట్ల విలువకు చేరింది. అటువంటి భూమిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ నీ ఇష్టారాజ్యంగా బినామీలకు ఇచ్చేశావు. నీ హయాంలో 54 ప్రభుత్వ కంపెనీలను నష్టాల్లోకి నెట్టేసి ఆ కంపెనీలను తెలుగు తమ్ముళ్ళకు అప్పజెప్పావు. ఆఖరికి ఆయా కంపెనీల్లో పనిచేసే 26 వేల మంది ఉద్యోగులు, కార్మికుల కు టుంబాలను రోడ్డున పడేసిన ఘనుడవు నీవు. అని విజయమ్మ విమర్శించారు.
 
 విశాఖలో నేడు విజయమ్మ నామినేషన్
 అనకాపల్లి: వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్ వేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement