తణుకు.. టీడీపీలో వణుకు | eelction war between tdp ,ysrcp in Tanuku constituency | Sakshi
Sakshi News home page

తణుకు.. టీడీపీలో వణుకు

Apr 29 2014 12:46 AM | Updated on May 25 2018 9:12 PM

తణుకు..  టీడీపీలో వణుకు - Sakshi

తణుకు.. టీడీపీలో వణుకు

జిల్లాలో పారిశ్రామిక ప్రగతిలో ముందున్న తణుకు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.

 ప్రధాన అభ్యర్థులు

 చీర్ల రాధాకృష్ణ (రాధయ్య) (వైఎస్సార్ సీపీ )
 ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ)
 బొక్కా భాస్కరరావు (కాంగ్రెస్)
 
 తణుకు, న్యూస్‌లైన్ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతిలో ముం దున్న తణుకు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అసెంబ్లీ బరిలో 13 మంది అభ్యర్థులున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్, జైసమైక్యంధ్ర పార్టీలు నామమాత్రంగా మారాయి. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా కొత్తవారు కావడం విశేషం. అధికారం, ధనప్రవాహాన్ని పక్కనపెట్టి సామాన్యులకు సైతం పట్టం కట్టిన ఘనత తణుకు నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చిన సంఘటనలూ ఉన్నాయి.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీర్ల రాధాకృష్ణ (రాధయ్య), టీడీపీ తరఫున ఆరిమిల్లి రాధాకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థిగా బొక్కా భాస్కరరావు తలపడుతున్నారు.
 
 వైసీపీకి అనుకూలం
 సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన  వైఎస్సార్ సీపీ అభ్యర్థి చీర్ల రాధయ్య 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకం కావటంతో పాటు సర్పంచ్‌గా, ఏఎంసీ చైర్మన్‌గా పనిచేసి గ్రామీణ ప్రాంత, రైతు సమస్యలు, పాలన వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తిగా పేర్గాంచారు. ఇది వైసీపీ విజయానికి అనుకూల అంశం కానుంది. తణుకులో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆరిమిల్లి రాధాకృష్ణ సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఏడాది క్రితమే రాజకీయాల్లోకి రావడం ఆ పార్టీకి ప్రతికూల అంశం. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన  కాంగ్రెస్ అభ్యర్థి బొక్కా భాస్కరరావు దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా వివిధ వర్గాలతో సత్సంబంధాలు నెరపటంలో వెనుకంజలో ఉన్నారు.  
 
అభివృద్ధి ప్రదాత వైఎస్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఐదుసార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. తణుకుకు చెందిన బోళ్ల బుల్లిరామయ్య ఏలూరు ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రి పదవిని కూడా అలంకరించారు. అయినా ఏ ఒక్క నాయకుడు తణుకులో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటువంటి తరుణంలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తణుకులో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది ఒక్క మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అని చెప్పవచ్చు. పట్టణంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఇళ్ల నిర్మాణం, వరద ముంపు ప్రాంతాల్లో డ్రెయిన్లు ఆధునికీకరణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్వోబీ నిర్మాణం, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరు, పాఠశాలల అభివృద్ధి, పేదలకు కాలనీల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement