బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి

బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి - Sakshi


♦ వైఎస్సార్ సీపీ నేత బొత్స డిమాండ్

♦ బాక్సైట్‌కు వ్యతిరేకంగా 10న చింతపల్లిలో వైఎస్ జగన్ సభ

 

 సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జారీ చేసిన జీవో 97ను రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడారు. జీవోను రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కేబినెట్‌లో నిర్ణయించినట్టు కొందరు మంత్రులు చెప్పారని,  పూర్తిగా  రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయాలన్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గిరిజనులకు మద్దతుగా ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటిగంటకు చింత పల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారని ఆయన తెలి పారు. ఈ సభ ద్వారా తవ్వకాలపై పార్టీ స్టాండ్.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.  బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరి జనుల మనోభావాలకు విరుద్ధంగా  ముందుకెళ్లాలని చూస్తే తీవ్ర  ప్రతిఘటన తప్పదన్నారు.



 లోకేశ్ స్నేహితునికి భూ సంతర్పణ

 విశాఖలో ఎకరా రూ.7 కోట్ల విలువైన 50 ఎకరాల భూముల్ని ఎకరా రూ.50 లక్షలకే  ధారాదత్తం చేశారని బొత్స విమర్శించారు. ఢీ సెంట్రిక్ సొల్యూషన్స్ పేరిట ఈ భూముల్ని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగికి కట్టబెట్టారని,  లోకేశ్ మిత్రుడు కావడమే ఆయనకున్న అర్హతన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికీ ఇదే రీతిలో విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట వద్ద 250 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా ఇచ్చేశారన్నారు. చిత్తూరులో 21 కోట్ల విలువచేసే భూమిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు రూ.4 కోట్లకే కేటాయించారన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఓ హైస్కూల్లో జాతీయ జెండా కట్టిన పోల్‌ను లాక్కొచ్చి దానికి టీడీపీ జెండా కట్టి బాబు ఆవిష్కరించారని, జాతీయజెండాపై ఆయనకున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోందని బొత్సా ఎద్దేవా చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top