శుభఘడియలు సమీపిస్తుండగా కాబోయే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా మూడ్రోజుల్లో పెళ్లి ఉందనగా అతను ఉరేసుకోవడం కలకలం రేపింది.
తాడిపత్రి రూరల్: శుభఘడియలు సమీపిస్తుండగా కాబోయే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా మూడ్రోజుల్లో పెళ్లి ఉందనగా అతను ఉరేసుకోవడం కలకలం రేపింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాములమ్మ, ఓబులేసు దంపతుల కుమారుడు రమేష్(24) గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు.
రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలానికి చెందిన ఓ యువతితో ఈ నెల 21న రమేష్ పెళ్లి నిర్ణయించారు. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయించి అందరికీ స్వయంగా తనే పంచిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం నీళ్లు తెస్తానంటూ బిందెలు తీసుకుని ఇంటి నుంచి వ్యవసాయ పొలాల వద్దకు బయలుదేరిన రమేష్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతన్ని వెతుక్కుంటూ పొలాల వద్దకు బయలుదేరారు.
అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో కుప్పకూలిపోయారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ సంఘటన రెండు గ్రామాల్లో విషాదం నింపింది.


