అత్త మృతి.. అల్లుడిపై అనుమానాలు! | woman murdered in bottle attack due to property disputes | Sakshi
Sakshi News home page

అత్త మృతి.. అల్లుడిపై అనుమానాలు!

Jun 18 2016 7:35 PM | Updated on Sep 4 2017 2:49 AM

ఓ మహిళ పట్టపగలే దారుణహత్యకు గురైంది.

నర్సాపూర్‌ రూరల్: ఓ మహిళ పట్టపగలే దారుణహత్యకు గురైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, కుటుంబీకులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపల్లి పంచాయతీ తావుర్యా తండాకు చెందిన మెగావత్ విఠల్ భార్య తార(48) నేటి ఉదయం నాగులపల్లి పాఠశాల వైపు నుంచి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కల్లు సీసాతో విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు.

తార మృతదేహాన్ని పక్కనే ఉన్న కుంటలో పడేసి నిందితులు వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు అటుగా మూత్రవిసర్జనకు వెళ్లగా ఆమె మృతదేహం కనిపించింది. వారు వెంటనే ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అల్లుడిపై ఎన్నో అనుమానాలు!
ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమెను అల్లుడు జగదీషే చంపి ఉంటాడని బంధువులు, భర్త ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అత్త చనిపోయిన విషయం తెలిసినా అతడు రాకపోవటంతో అనుమానాలకు ఊతమిచ్చినట్లు అయింది.

Advertisement
 
Advertisement
Advertisement