కొలిమిగుండ్లలో ఓ వివాహితను కరెంట్ తీగ బలి తీసుకుంది.
కాటేసిన కరెంట్ తీగ
Feb 13 2017 11:15 PM | Updated on Sep 5 2018 2:26 PM
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్లలో ఓ వివాహితను కరెంట్ తీగ బలి తీసుకుంది. గ్రామానికి చెందిన బరీదు దస్తగర్తి భార్య మహాలక్ష్మి (32) సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న కుళాయి వద్ద నీళ్లు పట్టుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో విద్యుత్ స్తంభం నుంచి తీగ తెగి ఆమెపై పడటంతో విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. పక్కనే ఉన్న స్థానికులు కర్రలతో తీగను తొలగించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ప్రమాదం జరిగిన స్థలంలో అప్పటి వరకు నలుగురు చిన్నారులు ఆటాడుకున్నారు. తీగ తెగే కొద్ది నిమిషాల ముందే అక్కడి నుంచి చిన్నారులు వెళ్లి పోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తీగలను మార్చక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
Advertisement


