మహిళల భద్రత కోసమే మరుగుదొడ్ల నిర్మాణం | toilets for ladies says minister ravindra | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత కోసమే మరుగుదొడ్ల నిర్మాణం

Jan 10 2017 11:54 PM | Updated on Oct 4 2018 5:35 PM

మహిళలకు రక్షణ, భద్రత కల్పించాలన్న ఉద్ధేశంతోనే ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

రొద్దం : మహిళలకు రక్షణ, భద్రత కల్పించాలన్న ఉద్ధేశంతోనే ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పీర్లడచావిడిలో మంగళవారం సర్పంచ్‌ అశ్వర్థనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు జన్మభూమి–మాఊరు గ్రామసభకు మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అడిగిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్‌ ఇల్లు మంజూరు చేస్తోందన్నారు.1.30 లక్షల తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేశామని, దాదాపు 4.20 కోట్ల జనాభాలో 1.35 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఐదుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అప్పులు, తెలంగాణకు ఆస్తులను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పేదలు ఆనందంగా పండుగ చేసుకోవాలన్న సంకల్పంతోనే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌ పండుగ కానులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 63 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్‌ మహబూబ్‌బాషా, హౌసింగ్‌ డీఈ కుప్పిస్వామి, ఎంపీడీఓ జయచంద్రరెడ్డి, జెడ్పీటీసీ చిన్నప్పయ్య, ఎన్టీఆర్‌ పథకం కాంట్రాక్టర్‌ గోవిందప్ప, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement