సంక్షేమ, ఇతరత్రా పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం బేషుగ్గా ఉందని వివిధ రాష్ట్రాల సంక్షేమ శాఖల నుంచి కితాబు లభించింది
దక్షిణాది రాష్ట్రాల సంక్షేమశాఖల కితాబు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ, ఇతరత్రా పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం బేషుగ్గా ఉందని వివిధ రాష్ట్రాల సంక్షేమ శాఖల నుంచి కితాబు లభించింది. ఈ విధానం ద్వారా పారదర్శకంగా ఈ పథకాల నిర్వహణకు ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయాన్ని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఉన్నతాధికారులు సైతం వ్యక్తం చేశారు. శుక్రవారం చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్, డెరైక్టర్ల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడంలో భాగంగా పలు అంశాల గురించి ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రే మండ్ పీటర్ తన ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
జాతీయ స్థాయితో పాటు, మిగతా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాల కంటే ఇది మెరుగైన విధానమని కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు, కళాశాలలకు నేరుగా కేంద్రం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ను చేసేందుకు వీలుగా ‘నేషనల్ ఈ స్కాలర్షిప్ పోర్టల్’లో చేరాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర సామాజికన్యాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు సూచించారు. తెలంగాణలో తాము పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిలోకి మారడానికి ఉన్న ఇబ్బందులను రేమండ్పీటర్ వివరించారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు.